
స్థానిక కేజీబీవీ పాఠశాలలో హెచ్పీవీ టీకాపై అవగాహన కార్యక్రమం
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 26 2026: స్థానిక కేజీబీవీ పాఠశాలలో బాలికల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి హెచ్పీవీ టీకాపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ బి. రాములు పాల్గొని బాలికలకు హెచ్పీవీ టీకా ప్రాముఖ్యతను సవివరంగా వివరించారు.
14 నుండి 15 సంవత్సరాల వయస్సులో ఈ టీకా తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖ క్యాన్సర్కు ముందస్తు రక్షణ కల్పించవచ్చని తెలిపారు. అలాగే ఈ టీకా వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి బలపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు ఈ టీకా తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 85 నుండి 90 శాతం వరకు తగ్గించుకోవచ్చని తెలియజేశారు.
ఈ టీకాను ప్రైవేటుగా వేయించుకుంటే సుమారు నాలుగు వేల నుండి ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, అయితే ప్రభుత్వం 2026 సంవత్సరం నుండి ఈ టీకాను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ టీకాను వైద్యుల పర్యవేక్షణలో ఒక్క మోతాదుగా వేయడం జరుగుతుందని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో గర్భాశయ ముఖ క్యాన్సర్ రెండవ స్థానంలో ఉన్న వ్యాధిగా గుర్తించబడిందని, సరైన వయస్సులో ఈ టీకా తీసుకోవడం ద్వారా దాదాపు 90 శాతం వరకు ఈ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. అందువల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది కలిసి యవ్వన దశలో ఉన్న బాలికలకు ఈ టీకా వేయించేందుకు ప్రోత్సహించడం ఎంతో అవసరమని సూచించారు.
గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలన దిశగా ఈ టీకా ఎంతో ఉపయోగకరమని వైద్యాధికారి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య నర్సు పుణ్యవతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఏఎన్ఎం రమణ మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



