
హోలీ వేడుకల్లో విషాదం
కాలువలో పడి యువకుడు మృతి
మూడు నెలల క్రితమే వివాహం… కుటుంబంలో విషాద ఛాయలు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మార్చి 05 2026: మండలంలో హోలీ పండుగ సందర్భంగా జరిగిన విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మండలానికి చెందిన మల్లు రామకోటి వారి కుమారుడు మల్లు సాయి (సుమారు 30 సంవత్సరాలు) ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు.
స్థానిక మండల ఎస్సై సంధ్య తెలిపిన వివరాల ప్రకారం, హోలీ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన సాయి, ఏన్కూరు పరిసర ప్రాంతంలోని కాలువలో దిగిన సమయంలో జారి నీటిలో మునిగిపోయాడు. అక్కడున్న వారు వెంటనే బయటకు తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై సంధ్య తెలిపారు.
ఇక సాయికు మూడు నెలల క్రితమే వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లి ఆనందం ఇంకా చల్లారకముందే ఈ విషాదం చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
హోలీ వంటి పండుగల సందర్భంగా నీటి వనరుల వద్ద అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు.



