
రెస్టారెంట్లో ఇరువర్గాల ఘర్షణ.. సీఐ సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం!
web desc : పట్టణంలోని ఓ రెస్టారెంట్లో యాజమాన్యం, కస్టమర్ మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న జనగామ పట్టణ సీఐ సత్యనారాయణ రెడ్డి అప్రమత్తమై వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో పోలీసు వాహనానికి డ్రైవర్ లేకపోవడంతో సీఐ సత్యనారాయణరెడ్డి స్వయంగా వాహనం నడుపుకుంటూ అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టి ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకున్నారు.
ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. సీఐ ఆలస్యం చేయకుండా గాయపడిన ఇద్దరినీ పోలీసు వాహనంలో జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. సకాలంలో వైద్యం అందడంతో వారు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
సమాచారం అందుకున్న ఎస్ఐ చెన్నకేశవులు పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని రెస్టారెంట్ పరిసరాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ సత్యనారాయణ రెడ్డి సకాలంలో స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు.




