
మహిళా ఎస్సై చెంపపై కొట్టిన ఎమ్మెల్యే కుమార్తె…
social media viral : కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే కూతురు మహిళా ఎస్సై చెంప పగలగొట్టారు. మండ్య జిల్లా శ్రీరంగపట్నం తాలూకా పరిధిలోని ‘ఆరతి ఉక్కడ’ అహల్యాదేవి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భీమన అమావాస్య సందర్భంగా ఆలయంలో విధుల్లో ఉన్న మండ్య మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై బి. సవితపై తుమకూరు గ్రామీణ బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ గౌడ కుమార్తె ఐశ్వర్య భౌతిక దాడికి పాల్పడటం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఘటన వివరాల్లోకి వెళితే.. భీమన అమావాస్య పండుగ సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఐశ్వర్య నేరుగా గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఇబ్బంది కలుగకుండా రెండు నిమిషాలు వేచి ఉండాలని ఎస్సై సవిత కోరారు.
దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఐశ్వర్య, తాను ఎమ్మెల్యే కుమార్తెనని చెబుతూ ఎస్సైతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న సీఐ లక్ష్మి వారిస్తున్నప్పటికీ, సవిత చెంపపై కొట్టి, విధులకు భంగం కలిగిస్తూ బెదిరింపులకు దిగినట్లు ఆరోపణలు వచ్చాయి.ఎమ్మెల్యే క్షమాపణలు.
ఈ ఘటనపై ఎస్సై సవిత ఇచ్చిన వివరాలతో క్యాతనహళ్లి పోలీస్ స్టేషన్లో ఐశ్వర్యపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు అర్థరాత్రి దాటిన తర్వాత ఠాణాకు వచ్చిన ఐశ్వర్య, ఎస్సై సవితనే తనతో అసభ్యంగా ప్రవర్తించారని పేర్కొంటూ కౌంటర్ ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే కూతురు ఎస్సైపై చేయి చేసుకోవడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఎమ్మెల్యే సురేశ్ గౌడ తన కుమార్తె ప్రవర్తన పట్ల బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆలయాలు ప్రశాంతత కోసం వచ్చే ప్రదేశాలని, తన కుమార్తె తప్పు చేసి ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. అంతేకాకుండా, దేవుని ముందు అందరూ సమానులేనని, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో వీఐపీ సంస్కృతిని (VIP culture) రద్దు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.




