
అర్ధరాత్రి ఆపదొస్తే.. ఖమ్మం పరుగు తీయాల్సిన అవస్థలు ఇక ఉండవు!
గిరిజన బిడ్డల ప్రాణాలకు మంత్రి పొంగులేటి భరోసా..
తిరుమలాయపాలెంలో రూ. 26 కోట్లతో 100 పడకల ఏరియా ఆసుపత్రికి శంకుస్థాపన
డిసెంబర్ కల్లా పనులు పూర్తి కావాలి.. కాంట్రాక్టర్కు ఆదేశాలు
సికె న్యూస్ ప్రతినిధి
తిరుమలాయపాలెం : “అర్ధరాత్రి వేళ ఆపద వస్తే.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఖమ్మం పరుగు తీయాల్సిన కష్టాలు ఈ ప్రాంత గిరిజన బిడ్డలకు ఇక ఉండవు. పేదవాడి సొంత గడ్డపైనే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడమే మన ప్రజా ప్రభుత్వ లక్ష్యం” అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.
గురువారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో సుమారు రూ. 26 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి ప్రంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
జిల్లా ఆసుపత్రిని మరిపించేలా వసతులు
గతంలో కేవలం 30 పడకలతో, అరకొర వసతులతో ఉన్న ఈ ఆసుపత్రి వల్ల ప్రజలు పడ్డ ఇబ్బందులను మంత్రి గుర్తు చేసుకున్నారు. “నాడు ప్రసవం కావాలన్నా, అత్యవసర చికిత్స కావాలన్నా ఖమ్మం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం తప్ప మరో మార్గం ఉండేది కాదు.
కానీ ఇప్పుడు మన ప్రజా ప్రభుత్వం వచ్చాక, జిల్లా హెడ్ క్వార్టర్ ఆసుపత్రిని మరిపించేలా ఇక్కడ అన్ని వసతులు కల్పిస్తున్నాం. డయాలసిస్ యూనిట్లు, అత్యాధునిక పరికరాలతో కూడిన వైద్యాన్ని రాబోయే కొద్ది నెలల్లోనే ఇక్కడ అందుబాటులోకి తెస్తాం” అని భరోసా ఇచ్చారు.
వైద్యులు దేవుళ్లతో సమానం.. ఇక్కడే ఉండాలి!
వైద్య సిబ్బంది పనితీరుపై మంత్రి దిశానిర్దేశం చేశారు. “ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టి భవనాలు కట్టవచ్చు.. కానీ డాక్టర్ అందుబాటులో ఉంటారనే నమ్మకం రోగికి కలిగినప్పుడే ఆ ఆసుపత్రికి సార్థకత ఉంటుంది. డాక్టర్లు, సిబ్బంది ఎక్కడో ఉండటం కాదు..
ఈ హెడ్ క్వార్టర్స్లోనే నివసించాలి. చర్ల, మణుగూరు, ఇల్లందు ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు అద్భుత ఫలితాలు ఇస్తున్నాయి. ఇక్కడ కూడా అదే అంకితభావం కావాలి. విధుల్లో చిత్తశుద్ధి చూపే సిబ్బందికి నా నియోజకవర్గం తరపున ప్రత్యేక బహుమతులు అందజేస్తాను” అని ప్రకటించారు.
విద్య, వైద్యమే మా ప్రభుత్వ అజెండా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదవాడికి నాణ్యమైన చదువు, వైద్యం అందించడమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. “కేవలం వైద్యమే కాదు.. రాబోయే రోజుల్లో విద్యారంగంలోనూ విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి.
గడిచిన రెండేళ్ల మూడు నెలల కాలంలోనే మౌలిక వసతుల కల్పనలో మనం ఎంతో పురోగతి సాధించాం. ఈ ప్రభుత్వం ఎవరినీ నొప్పించదు.. కానీ ఉద్యోగులు బాధ్యతగా పనిచేసి ప్రజలకు ఫలితాలు అందించాలి” అని స్పష్టం చేశారు.
కాంట్రాక్టర్ కి ఆదేశాలు… “మార్చిలో పనులు మొదలవుతున్నాయి.. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, మళ్లీ డిసెంబర్ నాటికే ఈ ఆసుపత్రిని ప్రారంభించాలి” అని గడువు విధించారు.
అనంతరం మంత్రి పొంగులేటి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆరోగ్య శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు , మండల నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.



