
ఖమ్మంలో మహిళా కానిస్టేబుల్ పై దాడి…
Web desc : భూదాన్ భూముల నిర్వాసితులతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిరసన ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తతకి దారి తీసింది. వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా నిరసన తెలిపేందుకు కవిత, డీఎస్పీ అధినేత విశారదన్ మహారాజ్ సోమవారం ఖమ్మం వచ్చారు.
స్థానిక అంబేడ్కర్ భవనంలో పునరావాసం పొందుతున్న భూదాన్ భూముల నిర్వాసితులతో మాట్లాడారు. తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ ఇళ్ల కూల్చివేతతో ఆడబిడ్డలు కన్నీళ్లు పెడుతున్నారని, వారి ఉసురు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని విమర్శించారు.
అన్నీ మంచిగా ఉంటేనే పరీక్షల సమయంలో విద్యార్థులు టెన్షన్ పడతారని, అటువంటిది ఈ పరీక్షల సీజన్ లో రాత్రికి రాత్రి భారీ పోలీసు బలగాలతో భూదాన్ భూముల్లో ఇళ్లను కూల్చడం దారుణమని అన్నారు. కొన్ని పార్టీలకు బాధితులను పరామర్శించడం ఎగ్జిబిషన్ లా ఉందని ఎద్దేవా చేశారు.
తాను ఆషామాషీ పరామర్శకు రాలేదని, మీ కోసం పోరాటం చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. ఇళ్లు కూల్చినచోటే వారికి ఇంటి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఇక్కడకు రావాలని కోరారు.
ఆ తర్వాత బాధితులతో కలిసి ఇద్దరు నేతలు ర్యాలీగా జడ్పీ సెంటర్ లోని అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. విగ్రహానికి వినతి పత్రం అందజేసి అక్కడే బైఠాయించారు. కలెక్టర్ వచ్చి నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చే వరకు కదలిలేది లేదని నిరసనకు దిగారు.
ఆందోళనకారులు మానవహారం ఏర్పాటు చేసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఆర్డిఓ శ్రీనివాస్, ఏసీపీ రమణమూర్తి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ కలెక్టర్ రావాలని కవిత, ఇతర నేతలు డిమాండ్ చేశారు.
మధ్యాహ్నం 12.30 నుంచి మొదలైన నిరసన కవితను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో 4.30 తో ముగిసింది. ఈ మధ్యలో పలుమార్లు పోలీసులకు, నిరసనకారులకు వాదులాట, తోపులాట జరిగింది.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ బాధితులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. తోపులాటలో ఓ మహిళా కానిస్టేబుల్ పై నిరసన కారులు దాడి చేశారు. అయిదు గంటలపాటు టెన్షన్ వాతావరణం నెలకొంది. కవితను పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు వ్యాన్ ఎక్కించారు.
కొద్ది దూరం ప్రయాణించిన తరవాత మహిళా పోలీసులు లేకపోవడంతో ఆమె అభ్యంతరం వ్యక్తం చేసి తాను ప్రయాణిస్తున్న వాహనాన్ని రోడ్డు మీద నిలిపివేయించారు. ఈలోగా ఆమె అక్రమ అరెస్టును నిరసిస్తూ జాగృతి కార్యకర్తలు ఆమె వాహనం ఎదుట నిరసన తెలిపారు.
పోలీసులు భారీగా చేరుకొని నిరసనకారులను తొలగించారు. ఆమెను మహిళా పోలీసులతో ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు, ఇతర నిరసనకారులను రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు.



