
మోటార్ల వైర్లపై దొంగల కన్ను!
వరుస చోరీలతో ఆరికాయలపాడు రైతుల్లో ఆందోళన
పొలాల వద్దే కోత.. స్థానికుల ప్రమేయంపై అనుమానాలు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 11 2026: ఏన్కూర్ మండలం ఆరికాయలపాడు గ్రామ సమీపంలోని ఏటి పరివాహక ప్రాంతంలో పంట పొలాలకు సాగునీరు అందించే మోటార్ల విద్యుత్ వైర్లు వరుసగా చోరీకి గురవుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రివేళ పొలాల వద్దకు చేరుకుని మోటార్లకు సంబంధించిన విద్యుత్ వైర్లను కట్ చేసి తీసుకెళ్తున్నట్లు రైతులు చెబుతున్నారు.
ఇటీవల జరిగిన చోరీతోపాటు గతంలోనూ ఇదే ప్రాంతంలో రెండు, మూడు సార్లు మోటార్ల వైర్లు చోరీకి గురైనట్లు రైతులు పేర్కొంటున్నారు. దీంతో ఈ ఘటనలు యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా.. లేక మోటార్లను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు చోరీలకు పాల్పడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వైర్లను కట్ చేసి తీసుకెళ్లడం వెనుక స్థానికులకు సంబంధం ఉందా? లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చి చోరీలకు పాల్పడుతున్నారా? అనే చర్చ రైతుల్లో సాగుతోంది. చోరీ చేసిన విద్యుత్ వైర్లను బయట విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
వరుస చోరీల కారణంగా మోటార్లపై ఆధారపడి పంటలకు సాగునీరు అందిస్తున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి వైర్లు చోరీకి గురైతే వాటిని తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు అదనపు ఖర్చు అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మోటార్ల వైర్ల చోరీలపై సమగ్ర విచారణ చేపట్టాలని, చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.




