
దొంగతనం నెపం.. అవమాన భారంతో ఆత్మ*హత్య
వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం (KU)లో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన శ్రీవిద్య (20), కేయూలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెండో సంవత్సరం చదువుతోంది. వర్సిటీలోని పద్మాక్షి హాస్టల్ బి-బ్లాక్లో ఉంటున్న సమయంలో, కొందరు సీనియర్ విద్యార్థులతో ఆమెకు వివాదం తలెత్తింది.
ఈ క్రమంలో శ్రీవిద్యపై ల్యాప్టాప్, బంగారం దొంగిలించిందనే ఆరోపణలు రావడమే కాకుండా, ఈ నెల 2న వర్సిటీ పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు కూడా నమోదైంది. దొంగతనం ఆరోపణలతో విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య!
దొంగతనం ఆరోపణల నేపథ్యంలో పోలీసులు శ్రీవిద్య తల్లిదండ్రులకు సమాచారం అందించి, ఆ వస్తువులకు సంబంధించిన డబ్బును చెల్లించాలని సూచించారు. విచారణ అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీవిద్యను ఆమె తల్లి అంజమ్మ ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా, దుందిరాలపాడు గ్రామంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లారు.
అయితే, తోటి విద్యార్థుల వేధింపులు, దొంగతనం నెపం మోపడం భరించలేక ఈ నెల 7న శ్రీవిద్య ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.తోటి విద్యార్థుల వేధింపులే కారణమంటూ వీడియోలో వెల్లడి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో శ్రీవిద్య ఒక వీడియోను రికార్డు చేసింది.
అందులో తన సహచర విద్యార్థులు తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని, తనను తీవ్రంగా వేధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.
ఈ ఘటనపై శ్రీవిద్య తల్లిదండ్రులు మధిర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక ఆశాకిరణం లాంటి విద్యార్థిని ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం పట్ల వర్సిటీ విద్యార్థులు, మృతురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



