
ఆ గ్రామ సర్పంచ్ ఎక్కడ…!?
Web desc : మఠంపల్లి : ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే విధంగా చూడవలసిన గ్రామ సర్పంచి అందుబాటులో లేకపోవడంతో ఆ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ప్రజలు సతమతం అవుతున్న పరిస్థితి మఠంపల్లి మండలంలోని సుల్తాన్ పురం తండాలో ప్రస్తుతం జరుగుతుంది.
ఇప్పటికే సర్పంచ్ పాలన లేక అనేక గ్రామ సమస్యలు పెండింగ్లో ఉన్న వాటిని త్వరగాతిన పూర్తి చేయాల్సిన సర్పంచ్ అందుబాటులో లేదని విమర్శలు వస్తున్నాయి.
ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు తీరుస్తారని భావించి సుల్తాన్ పురం తండాకు బానోత్ నాగమణి నీ ప్రజలు గెలిపించారు.
కానీ ఆమె గెలిచిన తర్వాత కోదాడలో కుటుంబ సభ్యులతో అక్కడే ఉంటూ పిల్లలను చదివించుకుంటున్నారని గ్రామ సమస్యలు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.
ఎన్నికలప్పుడు తనను గెలిపిస్తే అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిందని నేడు ఊరు విడిచి వెళ్లిపోయిందని ప్రజలు చెబుతున్నారు.
సర్పంచ్ నాగమణి భర్త గ్రామానికి అప్పుడప్పుడు వచ్చి తనే సర్పంచిగా అన్ని అధికారిక పనులలో కూడా జోక్యం చేసుకుంటున్నాడనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.
ముఖ్యంగా వేసవి కాలం కావడంతో తండాలలో తాగునీటి సమస్యలు ఎదుర్కొంటారు. దీనికి ముందస్తుగా ప్రణాళికలు తయారు చేసుకొని ప్రజలకు తాగునీరు అందించాల్సిన అవసరం ఉంది.
గ్రామానికి ఎన్నికైన ప్రజాప్రతినిధి గ్రామంలో ఉండకపోవడం వల్ల అభివృద్ధి పనులు మందగించడమే కాకుండా, ప్రభుత్వ పథకాలు కూడా సమయానికి అమలు కావడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న సర్పంచ్ దూరంగా ఉండటం వల్ల గ్రామ అభివృద్ధి దెబ్బతింటుందని వారు అంటున్నారు. ఈ పరిస్థితులపై ఉన్నతాధికారులు స్పందించి, గ్రామపంచాయతీ పాలన సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.



