
సంపులో పడి 8 నెలల పసికందు మృతి..
హైదరాబాద్ లో దారుణం జరిగింది.నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గండిపేట్ గ్రామంలో సంపులో పడి 8 నెలల పసిబిడ్డ మృతి చెందాడు. గురువారం ( ఏప్రిల్ 2 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి…
శ్రీతేజస్ శ్రీకాంత్ జాధవ్, రాధిక అనే కూలీ దంపతులు మహారాష్ట్ర నుంచి గండిపేట్ కి వచ్చి జీవనం సాగిస్తున్నారు, వీరికి సౌరబ్ జాధవ్ అనే 8 నెలల బాబు ఉన్నాడు. బుధవారం ( ఏప్రిల్ 1 ) మధ్యాహ్నం సౌరబ్ జాధవ్ ఆడుకుంటూ సంపులో పడి మృతి చెందాడు.
రోజూ లాగే.. నిన్న ఉదయం తన తమ్ముడు శంకర్, తల్లి ఉషతో కలిసి పనికి వెళ్లానని.., తన భార్య రాధిక ఇంట్లోనే ఉండి పసిబిడ్డ సౌరభ్ జాధవ్ను చూసుకుంటూ ఉందని తెలిపాడు బాబు తండ్రి శ్రీకాంత్ జాధవ్.
ఇంట్లో బాబును పక్కన వేసుకొని నిద్రపోతుండగా.. మధ్యాహ్నం సుమారు ఒంటిగంట సమయంలో శంకర్ ఇంటికి వచ్చి ప్లేట్లో అన్నం పెట్టుకుండటంతో శబ్దం విని రాధిక మేల్కొందని.. రాధిక లేచాక పక్కన బాబు కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికిందని తెలిపాడు.
ఈ క్రమంలో నీటి సంప్ మూత తెరిచి ఉండటం గమనించి లోపల చూడగా.. పసిబిడ్డ నీటిలో తేలుతున్నట్లు కనిపించిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు శ్రీకాంత్ జాధవ్. వెంటనే బిడ్డను బయటకు తీసి దగ్గరలో ఉన్న రేయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కు తరలించగా, బాబు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారని తెలిపాడు.
తనకు ఎవరిపైనా అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు శ్రీకాంత్. బిడ్డ ప్రమాదవశాత్తు నీటి సంప్లో పడిపోయి మృతి చెందినట్లు ప్రాధమికంగా నిర్దారించిన పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



