
ఖమ్మం జిల్లాలో అక్రిడిటేషన్ కమిటీని వెంటనే ప్రకటించాలి
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటే షన్ కార్డులు మంజూరు చేయాలి
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (TJA) ఖమ్మం జిల్లా అధ్యక్షులు జి. నాగ స్వామి
సికె న్యూస్ ప్రతినిధి
ఖమ్మం జిల్లాలో పెండింగ్లో ఉన్న అక్రిడిటేషన్ కమిటీని తక్షణమే ప్రకటించి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జి. నాగ స్వామి ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.
శుక్రవారం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్రిడిటేషన్ కమిటీల ఏర్పాటు పూర్తి కావడంతో పాటు తొలి సమావేశాలు కూడా నిర్వహించబడుతున్నాయని ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పటికీ కమిటీ
ప్రకటించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డుల కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారని కమిటీ ఆలస్యంతో జర్నలిస్టులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
జర్నలిస్టుల హక్కులు, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రిడిటేషన్ కమిటీని ప్రకటించి, కార్డుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన కోరారు. ఖమ్మం జిల్లాలో ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం తగదని జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని జి. నాగ స్వామి స్పష్టం చేశారు.




