
మహబూబాబాద్ జిల్లాలో ‘చేతబడి’ కలకలం: అర్ధరాత్రి నగ్నంగా తిరుగుతూ..
Web desc : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వేంగంపెట గ్రామ పంచాయతీ పరిధిలోని చక్రుతండాలో వింత సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొందరు వ్యక్తులు అర్ధరాత్రి వేళల్లో తండాలో నగ్నంగా తిరిగారు ,మంత్రాలు, చేతబడులు చేస్తున్నారా ??? అనే అనుమానం తండావాసులు తీవ్ర భయాందోళనలకు గురి చేస్తుందని వ్యక్తం చేస్తున్నారు.
తండాకు చెందిన కొందరు వ్యక్తులు ఇళ్ల ముందు, వీధుల్లో అర్థరాత్రి సమయంలో దిగంబరంగా తిరుగుతూ చేతబడి చేసారు అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనలతో తండా ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలన్నా, రాత్రి వేళల్లో నిద్రపోవాలన్నా వణికిపోతున్నారు.
పోలీసులు, అధికారుల జోక్యం అవసరం
ఈ మంత్రాల భయం కారణంగా తండాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. మూఢనమ్మకాలతో కొందరు చేస్తున్న ఈ పనుల వల్ల తండాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని, గ్రామస్తుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఈ విషయమై పోలీసులు, మండల అధికారులు వెంటనే స్పందించి చక్రుతండాలో క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టేందుకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, ఇలాంటి మూఢనమ్మకాలను ప్రచారం చేసేవారిపై, చేతబడుల పేరుతో భయభ్రాంతులకు గురిచేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తండా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తహశీల్దార్ కు వినతి పత్రం
తమ తండాలో చేతబడులు చేశారని తండా ప్రజలందరూ భయపడుతున్నారు అంటూ ఆ ప్రజల భయాన్ని పోగొట్టడానికి మండల అధికారులు స్పందించి ఆ భయానికి కారకులైనటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని అధికారుల చేత మంత్రాలపై కళాజాతం కార్యక్రమం నిర్వహించి భయాందోళనకు గురికాకుండా చేసేలా చర్యలు తీసుకోవాలని గూడూరు తహసిల్దార్ కు వ్యంగంపేట గ్రామ సర్పంచ్ గుగులో జవహర్ వినతి పత్రం అందజేశారు.




