
లారీపై కూలిన భారీ వృక్షం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
ప్రాణనష్టం తప్పినా.. గంటల పాటు నిలిచిపోయిన ట్రాఫిక్
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూన్ 22 2026: మండల పరిధిలోని ఏన్కూరు నుంచి కొత్తగూడెం వెళ్లే ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా ఐదు భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి సుమారు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న ఓ లారీపై ఒక్కసారిగా భారీ చెట్టు కూలి పడింది. అయితే అదృష్టవశాత్తూ డ్రైవర్తో పాటు లారీలో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీకి స్వల్ప నష్టం జరిగినట్లు తెలిసింది.
భారీ వర్షం, ఈదురుగాలుల ధాటికి రహదారి వెంట ఉన్న పెద్దపెద్ద వృక్షాలు వేర్లతో సహా నేలకొరిగి రహదారికి అడ్డంగా పడిపోయాయి. దీంతో ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ముఖ్యంగా ఖమ్మం-కొత్తగూడెం ప్రధాన రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమైంది. సమాచారం అందుకున్న పంచాయతీ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీల సహాయంతో రహదారిపై పడిన చెట్లను తొలగించే ప్రయత్నాలు చేపట్టారు.
గంటల పాటు శ్రమించి చెట్లను తొలగించడంతో క్రమంగా ట్రాఫిక్ పునరుద్ధరించబడింది. స్థానిక ప్రజలు కూడా చెట్ల తొలగింపు పనుల్లో సహకరించారు.
ఈ ఘటనతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.
వర్షాకాలంలో ప్రధాన రహదారుల వెంట ప్రమాదకరంగా ఉన్న పాత వృక్షాలను గుర్తించి ముందస్తుగా తొలగించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. సమయానికి స్పందించిన పంచాయతీ సిబ్బంది చర్యలతో మరింత ఇబ్బందులు తప్పినట్లు స్థానికులు పేర్కొన్నారు.




