
ఈ కార్యదర్శి మాకొద్దంటున్న సర్పంచ్… ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి..
web desc : మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి రాజు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, సర్పంచ్కు కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వడం లేదని పెద్ద శంకరంపేట సర్పంచ్ జంగం రేణుక శ్రీనివాస్ తెలిపారు. బుధవారం నాడు సర్పంచ్ ఇంట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఇంటి నిర్మాణ అనుమతుల విషయంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సర్పంచుకు తెలియకుండానే ఇంటి నిర్మాణానికి అనుమతులు హౌస్ నెంబర్లు కేటాయిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లే మార్గంలో నిర్మించిన 21 షటర్లకు నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నంబర్లు కేటాయించారని సర్పంచ్ పేర్కొన్నారు.
అంతేకాకుండా షటర్ల వెనుక భాగంలో ఖాళీ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేకపోయినా ఇంటి నంబర్ కేటాయించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. షట్టర్లకు ఇంటి నంబర్ల కేటాయింపులో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. తనను ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తానంటూ ఈవో హెచ్చరిస్తున్నారని కూడా సర్పంచ్ తెలిపారు.
ఈవోగా రాజు చార్జి తీసుకున్న రెండు నెలల కాలంలో పంచాయతీ పరిధిలో అనుమతులు, ఇంటి నంబర్ల కేటాయింపుపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సర్పంచ్ కోరారు. ఈవో తీరుపై సర్పంచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆయన తమకు వద్దని స్పష్టం చేశారు. ఈవో రాజు అవినీతిపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు.




