
వరలక్ష్మి వ్రతం రోజే లంచం తీసుకుంటూ దొరికిన వరలక్ష్మి
web desc : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దూకుడు పెంచారు. వరుసగా లంచావతారులపై పంజా విసురుతూ అవినీతి తిమింగిలాలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు.
మొన్న ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కగా, తాజాగా శుక్రవారం మంచిర్యాల జిల్లాలో మరో పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. జిల్లాలోని జన్నారం మండలంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
మండలంలోని లింగయ్యపల్లె గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వరలక్ష్మి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ పంచాయతీ కార్యదర్శిని ఆశ్రయించారు.
అయితే ఆ అనుమతి మంజూరు చేయడానికి పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి రూ.11 వేలు లంచం డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.బాధితుడి ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం జన్నారంలో మాటు వేసి, కార్యదర్శి వరలక్ష్మి లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఆమె నుంచి డిమాండ్ చేసి తీసుకున్న లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ప్రజలను ఇబ్బంది పెడుతూ లంచాలు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.




