KhammamPoliticalTelangana

కంటతడి పెట్టుకున్న మంత్రి తుమ్మల

కంటతడి పెట్టుకున్న మంత్రి తుమ్మల

కంటతడి పెట్టుకున్న మంత్రి తుమ్మల

సీతారామ ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఆవేదన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో కంటతడి పెట్టుకున్నారు.ప్రచారం కోసం బటన్‌లు నొక్కే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణంలో పాల్గొన్నానని అన్నారు. మంగళవారం నాడు ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

వాస్తవాలను ప్రజలకు చెప్పాలనే ఈ ప్రెస్‌మీట్ పెట్టినట్లు మంత్రి తుమ్మల అన్నారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో తన ఆవేదనను చెప్పదలచుకున్నానని అన్నారు.

‘భద్రాద్రి శ్రీ రామచంద్రుని దయవల్ల.. ఎన్టీఆర్ ఆశీర్వాదంతో వేల టీఏంసీల నీరు వృథాగా సముద్రం పాలవుతుంటే.. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్య శ్యామలం చేయాలనేది నా సంకల్పం. నాడు ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ ఇబ్బందులు వల్ల దుమ్ముగూడెం కాకుండా దేవాదుల ప్రాజెక్టు చేపట్టాం.

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నాడే విజ్ఞప్తి చేశాను. పోలవరం బ్యాక్ వాటర్ ఆధారంగా దుమ్ముగూడెం ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ చేపట్టాలని కోరాను. వైఎస్ అకాల మరణం తరువాత ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ పూర్తవ్వలేదు.’

‘తెలంగాణ ఉద్యమ ఫలితంగా టీఅర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ప్రాజెక్ట్ కోసమే కేసీఆర్ పిలుపు మేరకు టీఅర్ఎస్‌లో చేరాను. కేసీఆర్ రెండవ సారి అధికారంలోకి వచ్చాక కేవలం పంప్ హౌస్‌లు మాత్రమే నిర్మాణం చేశారు.

రోళ్ళపాడు బయ్యారం అలైన్‌మెంట్ మార్చారు. బీజీ కొత్తూరు, పూసు గూడెం, కమలాపురం పంప్ హౌస్‌లు పూర్తి చేయడానికి వాగులు వంకలు వద్ద బ్రిడ్జి నిర్మాణాలు చేయలేదు.

రాహుల్ గాందీ పిలుపు మేరకు కాంగ్రెస్‌లో చేరాను. సీఎం రేవంత్ భద్రాచలం పర్యటనలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ప్రతిపాదన చేశాను. జూలూరు పాడు టన్నెల్ పనులు మొదలవ్వ లేదు. యాతాల కుంట టన్నెల్ పూర్తి చేయలేదు కాబట్టి వైరా లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టాం.

డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ లేకుండా పంప్ హౌస్‌లు నిరర్థకంగా మారకుండా వైరా లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టాం. కృష్ణా జలాలు సకాలంలో రాకపోయినా వైరా లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలతో వానాకాలం సాగు నీరు అందుతుంది. వైరా లింక్ కెనాల్ రెండు నెలల కాలంలోనే 16 స్ట్రక్చర్ లు నిర్మాణం అయింది.’

‘టన్నెల్స్ నిర్మాణం పూర్తి అయ్యే వరకు పంప్ హౌస్ మోటార్లు పాడయ్యే అవకాశం ఉంది. దాంతో రూ. 8 వేల కోట్లతో చేసిన పనులు నష్టపోకుండా ట్రయల్ రన్ నిర్వహించాం. వైరా లింక్ కెనాల్ మధ్యలో గుజరాత్ గ్యాస్ పైప్ లైన్ వద్ద నిర్మాణాలకు వేగవంతంగా అనుమతులు తెచ్చాం.

జూలూరుపాడు టన్నెల్ పూర్తి చేస్తేనే పాలేరు రిజర్వాయర్‌కు గోదావరి నీళ్ళు వస్తాయి. భగవంతుడు ఇచ్చిన అవకాశంతో వెంసూరుకు తమ్మిలేరుకు, ఎన్టీఆర్ కెనాల్‌తో సాగునీళ్లు అందిస్తున్నారు. అత్యంత కరువు పీడిత ప్రాంతాల్లో 32 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లు నేనే చేశాను.

పాలేరు కరువుకు శాశ్వత పరిష్కారంగా భక్త రామదాసు లిఫ్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం చేశా. నేను నిర్మాణం చేసిన సాగు నీటి ప్రాజెక్టులపై రైతాంగం సంతోషంగా ఉన్నారు.’ అని మంత్రి చెప్పుకొచ్చారు.

హరీష్ వ్యాఖ్యలు బాధ పెట్టాయి..

మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు తనను బాధ పెట్టాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తాను ప్రచారం కోసం బటన్ నొక్కే పనులు చేయలేదన్నారు.

తాను ప్రేక్షకుడిగా మాత్రమే నిలబడ్డానని అన్నారు. తాను క్రెడిట్ కోసం పాకులాడే మనిషిని కాదన్నారు. తనకు ఎకరం పొలం కూడా ఈ ప్రాజెక్టు కింద లేదని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!