తీన్మార్ మల్లన్న పై ఫైర్ అయిన మంత్రి సీతక్క
తీన్మార్ మల్లన్న పై ఫైర్ అయిన మంత్రి సీతక్క;
తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ నేతల షాకింగ్ కామెంట్స్
సీఎం రేవంత్రెడ్డిపై కాంగ్రెస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లన్న వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మల్లన్నకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కార్యకర్తల శ్రమతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కొందరు నేతలు బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ చేయలేనిది తాము చేశామని.. అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పొల్చుకునే స్థాయి మల్లన్నది కాదని చెప్పారు. కులగణనపై అభ్యంతరాలు ఉంటే శానసనమండలిలో మాట్లాడాలని అన్నారు. కులగణనకు 50 రోజుల సమయం ఇచ్చామని.. అది సరిపోదా అని మంత్రి సీతక్క నిలదీశారు.
మీనాక్షి నటరాజన్తో మంత్రి సీతక్క భేటీ
కాగా.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్తో మంత్రి సీతక్క, షబ్బీర్ అలీ, జానారెడ్డి, జీవన్ రెడ్డి, వీహెచ్ తదితరులు విడివిడిగా గాంధీభవన్లో సమావేశమయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తమ అభిప్రాయాలను చెప్పాలని పీఏసీ సభ్యులను మీనాక్షి నటరాజన్ కోరారు.
బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు: వంశీ చంద్ రెడ్డి
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న వ్యాఖ్యలను ఖండించారు. తన ఓటమికి సీఎం రేవంత్ రెడ్డి కారణం అంటూ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కేవలం తన ఉనికి కోసమే అని చెప్పారు. తాను మహబూబ్నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్నది అధిష్ఠానం నిర్ణయమని తెలిపారు. తన గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో శ్రమించారని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగానే మహబూబ్ నగర్లో బీజేపీ గెలిచిందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉండటంతో ఆమెను బయటకు తీసుకు రావడం కోసం బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అమ్ముడుపోయిందని ఆరోపించారు. గతంలో కేసీఆర్ లాంటి నేతలు ఎంపీగా పని చేసిన మహబూబ్నగర్ సిట్టింగ్ సీట్లో బీఆర్ఎస్ డిపాజిట్ కోల్పోయి బీజేపీకి మద్దతు ఇచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరూ తన గెలుపు కోసం సమష్టిగా కృషి చేశారని వంశీ చంద్ రెడ్డి పేర్కొన్నారు.
మల్లన్నకు జానారెడ్డి వార్నింగ్
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందించారు. కులగణన అంశంలో తన పాత్ర లేదని చెప్పారు. మల్లన్న గాలి మాటలు మాట్లాడితే కుదరదని హెచ్చరించారు. తప్పు చేసిన వాడిని క్షమించే గుణం తనదని అన్నారు. తనను ఎవరూ తిట్టిన తాను పట్టించుకోనని చెప్పారు. తీన్మార్ మల్లన్న సమావేశంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. ప్రత్యేక్ష రాజకీయాలకు తాను దూరం. సలహాలు అడిగితే ఇస్తానని తెలిపారు. పరిపాలన చేసే వారు సైతం ఆడిగితేనే సలహాలు, సూచనలు ఇస్తానని అన్నారు. తమ నాయకులు తనను విమర్శిస్తే ఖండిస్తాలేరన్నారు. అలాగని సమర్ధించడం లేదని చెప్పారు. ఎందుకో వారినే అడిగి తెలుసుకోవాలని జానారెడ్డి అన్నారు.
తీన్మార్ మల్లన్న అంశం నాకు సంబంధం లేదు: హనుమంతురావు
తీన్మార్ మల్లన్న అంశం తనకు సంబంధం లేదని మాజీ ఎంపీ వీ. హనుమంతురావు అన్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని మీనాక్షి నటరాజన్కు చెప్పానని అన్నారు. ఇవాళ (బుధవారం)గాంధీభవన్లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. మీనాక్షి నటరాజన్ తనను ఏమి అడగలేదని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని మీనాక్షి నటరాజన్కు చెప్పానని హనుమంతురావు అన్నారు.