
వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి
ప్రథమ చికి త్స కేంద్రంలో వైద్యం వికటించి మూడేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లెపల్లి గ్రామంలో గురువారం జరిగింది.
గ్రామస్తులు, బంధువుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొలిచెల్మ మల్సూర్, మహేశ్వరి దంపతులకు కూతురు మణిదీప (3)ఉంది. చిన్నారికి వరుసకు సోదరుడైన వ్యక్తికి గాయమైతే ఇటీవల మందులు తెచ్చి ఇంట్లో ఉంచారు.
కాగా, బుధవారం సాయంత్రం మనిదీప ఇంట్లో ఆడుకుంటూ మందులు, ఆయింట్మెంట్ మిగింది. దీంతో బాలికకు వాంతులు అయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు మరిపెడలోని రవి క్లీనిక్ ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ ఆర్ఎంపీ రవిబాబు పాపను పరీక్షించి చికిత్స అందించాడు.
బాగానే ఉందని రాత్రి 8 గంటలకు ఇంటికి పంపించాడు. మళ్లీ రాత్రి 10 గంటల సమయంలో చిన్నారికి వాంతులు ఎక్కువ కావడంతో సదరు ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. ఇంజక్షన్ వేసి అర్ధరాత్రి ఇంటికి పంపాడు, అయితే తెల్లవారుజామున చిన్నారి ఉలుకుపలుకు లేకపోవడంతో తల్లిదండ్రులు మళ్లీ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా.. పాప ఆరోగ్య పరిస్థితి విషమించిందని, ఖమ్మం తీసుకెళ్లాలని సూచించారు.
దీంతో వారు చిన్నారిని తీసుకొని ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆర్ఎంపీ రవిబాబు నిర్లక్ష్య వైద్యం వల్లే పాప మృతి చెందిందని ఆగ్రహంతో ఉల్లెపల్లి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, బంధువులు అధిక సంఖ్యలో తరలివచ్చి రవి క్లీనిక్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆర్ఎంపీపై దాడికి యత్నించారు.
దీంతో గంటపాటు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈక్రమంలో పోలీసులు ఆర్ఎంపీని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయినప్పటికీ ఖమ్మం-వరంగల్ హైవేపై బైఠాయించి ధర్నా చేశారు.
న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. ఇదిలా ఉండగా తమకు బాబు పుట్టిన 18 ఏళ్ల తర్వాత మణిదీప పుట్టిందని తల్లి దండ్రులు బోరున విలపించారు.