
అప్పుల బాధతో మహిళ ఆత్మహత్య..
web desc : కుటుంబ ఆర్థిక ఇబ్బందులు, భర్త మద్యానికి బానిసై పనులు చేయకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం మండల కేంద్రమైన కొల్చారంలో జరిగింది. మృతురాలి బంధువులు, కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మోయుముద్దీన్ కథనం ప్రకారం వివరాలు…. కొల్చారం గ్రామానికి చెందిన కొరంపల్లి కృష్ణవేణి (38)కి సుమారు 15 ఏళ్ల క్రితం గ్రామానికి చెందిన దోన్కేన కృష్ణతో వివాహమైంది.
ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త కృష్ణ గత కొంతకాలంగా పనులకు వెళ్లకుండా మద్యం సేవిస్తూ తిరుగుతున్నాడు , దీంతో కుటుంబ అప్పులు పెరిగాయని మృతురాలి తల్లి కొరంపల్లి లక్ష్మి తెలిపింది. అప్పులు ఎలా తీర్చాలనే ఆందోళనతో కృష్ణవేణి కొంతకాలంగా మనస్తాపం చెందుతుంది.
సోమవారం ఉదయం సుమారు 7 గంటలకు కృష్ణవేణి ఇంట్లో ఉరేసుకున్నట్లు ఆమె కుమారుడు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు అక్కడికి చేరుకుని కిందకు దించినప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.




