
ఖబర్దార్ సీతక్క… మాజీ సీఎం కేసీఆర్ కి వెంటనే క్షమాపణ చెప్పాలి: సత్యవతి రాథోడ్ హెచ్చరిక
మహబూబాబాద్:ఏప్రిల్14
మహబూబాబాద్ జిల్లా క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ మంత్రి సీతక్క మాజీ సీఎం కేసీఆర్ గారికి లీగల్ నోటీసులు పంపడం చాలా సిగ్గుచేటు చర్య అని తీవ్రంగా విమర్శించారు. సంబంధం లేకుండా రాజకీయ డైవర్షన్ కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
మంత్రి సీతక్క అవినీతి ఆరోపణలు చేస్తే అవినీతి పోతుందా అని ప్రశ్నించిన సత్యవతి రాథోడ్, సెల్ఫోన్ కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు.
అంగన్వాడీ కేంద్రాలకు 38 వేల ఫోన్లు ఇచ్చి, రూ.6 వేల ధర ఉన్న ఫోన్లను రూ.14 వేలుగా చూపించడం అవినీతి కాదా అని నిలదీశారు. నిజంగా అవినీతి జరగలేదని చెప్పాలంటే ఫోన్ల కొనుగోళ్లపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఒకవైపు తెలంగాణలో 4G ఫోన్లు పంచుతూ, ఆంధ్రప్రదేశ్లోని 5G ఫోన్ల ఫోటోలను తెలంగాణలో ప్రచారం చేయడం దారుణమని పేర్కొన్నారు. 4G ఫోన్ ఇచ్చి 5G ఫోన్ ప్రచారం చేయడం ఎంతవరకు సబబో మంత్రి సీతక్క ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.
ఇక బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తల వద్ద చాలా చెప్పులు ఉన్నాయని, అవసరమైతే తాము కూడా ఘాటుగా స్పందించగలమని హెచ్చరించారు.
అలాగే,“ఒక్క మహిళనైనా కోటీశ్వరురాలిగా మార్చావా సీతక్క?” అంటూ ప్రశ్నిస్తూ మహిళల అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళా మంత్రిగా ఉన్న సీతక్క మాట్లాడే మాటలు బాధ్యతగా ఉండాలని సూచించిన ఆమె, కేసీఆర్ హయాంలో శిశు సంక్షేమ శాఖ దేశంలో ముందువరుసలో నిలిచిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని విమర్శించారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని తాము చెబుతున్న ఆరోపణలను ప్రభుత్వం నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టకుండా ప్రతి పథకంలో, ప్రతి స్కీములో స్కాములు జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు త్వరలోనే సాగనంపడం ఖాయమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.




