
గత ప్రభుత్వ దోపిడీకి కాంగ్రెస్ పాలనతోనే స్వస్తి
- మద్దినేని బేబీ స్వర్ణకుమారి, తుంబూరు దయాకర్ రెడ్డి వెల్లడి
- మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఘనంగా తెలంగాణ అవతరణ వేడుకలు
ఖమ్మం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ అవినీతి పాలనతో అప్పులపాలైన తెలంగాణను, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, ప్రగతి పథంలో నడిపిస్తోందని కొనియాడారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. గత పదేళ్లలో నిశ్చేష్టంగా మారిన పాలేరు నియోజకవర్గాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇళ్లు, రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణాలతో ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ళు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందించే కార్యక్రమాన్ని క్రియాశీలంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.




