
తెలంగాణలో ఏపీ పోలీసుల హల్చల్..
తుంగభద్ర ఇసుక తవ్వకాలపై ఏపీ పోలీసుల దాడులు
Web desc : తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండల కేంద్ర సరిహద్దులో ఉన్న తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలపై ఏపీ, తెలంగాణ అధికారులు ఎన్నిసార్లు పరిశీలించినా సరిహద్దు వివాదం ఆగడం లేదు.
శనివారం అర్ధరాత్రి ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా గ్రామం లో పర్యటిస్తూ ఎడ్లబండ్లతో డంప్ చేసుకున్న ఇసుకను తరలిస్తున్నారంటూ దాడులు నిర్వహించారు.
ఖాళీగా ఉన్న ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుంటామని బెదిరిస్తూ హల్చల్ చేశారు. ఆగ్రహించిన స్థానికులు అక్కడికి చేరుకొని ‘మా సరిహద్దులోకి వచ్చి గ్రామ నడిబొడ్డు మా వాళ్లనే బెదిస్తారా?’ అంటూ ఏపీ పోలీసులపై తిరగబడ్డారు. అక్కడ ఉన్న ఏపీ పోలీసులు.. తమ సరిహద్దులో ఇసుకను తరలిస్తున్నారనడంతో మరింత ఊగిపోయిన జనం కేకలు వేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
సమాచారం తెలుసుకున్న రాజో ళి ఎస్సై తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని ఏపీ పోలీసులు తమ అనుమతులు లేకుండా వచ్చి రగడ చేస్తారా?, సమాచారం లేకుండా వచ్చి హల్చల్ చేయడం సరికాదని ఏపీ పోలీసు అధికారులతో మాట్లాడారు. దీంతో ఏపీ పోలీస్ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తరుచూ ఇలా ఏపీకి చెందిన కొందరు వ్యక్తులు దాడులకు పాల్పడుతూ ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు ఆరోపించారు.
ఇసుకను తరలిస్తే అడ్డుకుంటామన్న ఏపీ నాయకులు..
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చిన ఇసుక రీచ్ల ద్వారా కూడా ఇసుకను తరలించే అవకాశం లేదని ఏపీకి చెందిన ఓ నాయకుడు వారం రోజలు కిందట తూర్పుగార్లపాడు రీచ్ దగ్గరకు 100 మంది కార్యకర్తలతో వచ్చి అధికారులను హెచ్చరించారు. ఆ నాయకుడు హెచ్చరిస్తున్న సమయంలో అక్కడే ఉన్న గద్వాల జిల్లా మైనింగ్ అధికారి, సీఐలు ఏమీ అనలేక చూస్తూ ఉండిపోయారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతులున్నా ఇసుకను తరలించరాదని ఏపీ చెందిన నాయకుడు చెప్తున్నా ఇక్కడి అధికారులు స్పందించకపోవడం విడ్డురంగా ఉన్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి తుంగభద్ర నదిలో హద్దులను గుర్తించి తెలంగాణ ప్రజలకు సహకరించాలని కోరుతున్నారు.




