
బీజేపీ నుంచి ఆ నేత సస్పెండ్.. ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షడు
బీజేపీ కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన నాయకుడు రామకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు ఆదేశాల మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఈటెల రాజేందర్కు వ్యతిరేకంగా కంటోన్మెంట్ ప్రాంతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వ్యవహారంలో రామకృష్ణ పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాన్ని పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.
పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించడం, అంతర్గత విభేదాలను బహిర్గతం చేయడం క్రమశిక్షణా ఉల్లంఘనగా భావించిన పార్టీ నాయకత్వం ఆయనపై చర్యలు చేపట్టింది. సస్పెన్షన్తో పాటు రామకృష్ణకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వారం రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ సమర్పించాలని పార్టీ ఆదేశించింది. నిర్ణీత గడువులో సమాధానం ఇవ్వకపోతే లేదా వివరణ సంతృప్తికరంగా లేకపోతే తదుపరి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.




