
రూ.1.70 లక్షలకు శిశువు విక్రయం..హైదరాబాద్ పీఎస్ పరిధిలో ఘటన
Social media viral : 12 రోజుల వయస్సు ఉన్న మగ శిశువును అక్రమంగా విక్రయించిన ఘటన కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.
సుమారు 18 ఏళ్లుగా సంతానం లేని మధుసూదన్, మీనా దంపతులు బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నారు. జియాగూడ పుకట్నగర్కు చెందిన పోతరాజు సురేశ్ను సంప్రదించగా, అతడు పద్మ పల్తియా అనే మహిళతో కలిసి మధ్యవర్తిత్వం చేశాడు.
మే 28న తుక్కుగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మోహన్, సంధ్య దంపతులకు జన్మించిన మగ శిశువును అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గా సమీపంలో సురేశ్సమక్షంలో మధుసూదన్, మీనా దంపతులు రూ.1.70 లక్షలు చెల్లించి శిశువును తీసుకున్నారు.
దత్తతకు సంబంధించిన నిబంధనలు పాటించకుండా ఈ లావాదేవీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. శిశువు శారీరక వైకల్యంతో జన్మించినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శిశువును అమీర్పేటలోని శిశు విహార్కు తరలించారు.




