
గురుకుల పాఠశాలలో ఎమ్మెల్సీ ఆకస్మిక తనిఖీ.. వార్డెన్పై ఆగ్రహం!
కడప: నగరంలోని చిన్నచౌక్లో ఉన్న డా. బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలను శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతి సదుపాయాలు మరియు పాఠశాల నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు.
పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారంలో నిర్దేశిత మెను పాటించడం లేదని గుర్తించిన ఎమ్మెల్సీ వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా నాసిరకం కూరగాయలు వినియోగించడం, గుడ్లు మరియు ఇతర ఆహార పదార్థాల నాణ్యత సరిగా లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
భోజన నాణ్యతపై విద్యార్థులను స్వయంగా అడిగి వివరాలు తెలుసుకున్న ఎమ్మెల్సీ, విద్యార్థుల ఆరోగ్యంతో ఎలాంటి రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. “విద్యార్థుల కడుపు కొట్టొద్దు.. వారికి నాణ్యమైన ఆహారం అందించడం బాధ్యత” అని స్పష్టం చేశారు.
అలాగే నాసిరకం గుడ్లు, కూరగాయలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెను అమలు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వార్డెన్పై తగిన చర్యలు తీసుకోవాలని ఇంచార్జి ప్రిన్సిపాల్కు ఎమ్మెల్సీ ఆదేశాలు జారీ చేశారు.




