
బీజేపీ అంగ సంస్థలా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోంది : సీపీఐ
అర్హులైన ఓటర్ల హక్కులను కాలరాయొద్దని డిమాండ్
తొర్రూరులో ముగిసిన సీపీఐ మహబూబాబాద్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు
పాలకుర్తి/తొర్రూర్,(ck న్యూస్)ప్రతినిధి పల్లె దేవేందర్ గౌడ్ : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా మారకూడదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాలను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల అద్దె ఇళ్లలో నివసించే వారు, వలస కార్మికులు సహా లక్షలాది మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
తొర్రూరులో నిర్వహించిన మూడు రోజుల రాజకీయ శిక్షణ శిబిరాల ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. నల్ల సుధాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి. విజయసారథి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. అజయ్ తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక లోపాలు, వయస్సు తారతమ్యాల పేరుతో సామాన్య ప్రజల ఓట్లను తొలగించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహించాలి. బూత్ లెవల్ అధికారుల ద్వారా అడుగుతున్న పత్రాలు, నిబంధనలపై స్పష్టత లేక ప్రజల్లో గందరగోళం నెలకొందని తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు.
అధికార పక్షానికి లబ్ధి చేకూరేలా విపక్షాలకు అనుకూల ప్రాంతాల్లో ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటర్ల ధృవీకరణ కోసం ఆధార్ కార్డుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు వంటి ఇతర గుర్తింపు పత్రాలను కూడా అనుమతించాలని డిమాండ్ చేశారు.
దేశంలో కమ్యూనిజానిదే భవిష్యత్తు : తక్కళ్లపల్లి
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ విధానం సంక్షోభంలో కూరుకుపోతుండగా కమ్యూనిస్టు అనుకూల శక్తులు బలపడుతున్నాయని తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
దేశంలో నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల, సామాజిక అసమానతలు పెరుగుతున్న నేపథ్యంలో కమ్యూనిజానికే భవిష్యత్తు ఉందని అన్నారు. భారతదేశంలో అనేక నిర్బంధాలను ఎదుర్కొని నేటి వరకు నిలబడ్డ చరిత్ర సీపీఐదేనని చెప్పారు.
సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బి. విజయసారథి, మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తమ్మెర విశ్వేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి. అజయ్, సారధి రెడ్డి, కట్టెబోయిన శ్రీనివాస్, హోమ బిక్షపతి, బందు మహేందర్, కిరణ్, లక్ష్మణ్, పెరుగు కుమార్, రేశపల్లి నవీన్, చింతకుంట్ల వెంకన్న, మామిండ్ల సాంబలక్ష్మి, కట్లోజు పాండురంగాచారి, వరిపల్లి వెంకన్న, నెల్లూరు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.




