
డోర్నకల్ పోలీస్ స్టేషన్పై ఎస్పీ ఆకస్మిక తనిఖీ
పెండింగ్ కేసులు వేగంగా పూర్తి చేయాలి.. గ్రామస్థాయిలో సైబర్ అవగాహన పెంచాలి
పాలకుర్తి/మహబూబాబాద్,(ck న్యూస్) ప్రతినిధి పల్లె దేవేందర్ గౌడ్ : మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, ఐపీఎస్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ నిర్వహణ, పెండింగ్ కేసుల పురోగతి, రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్ఎస్ నమోదులు, స్టేషన్ పరిశుభ్రత, సిబ్బంది పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రతి కేసును బాధ్యతాయుతంగా విచారించాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడిని మర్యాదపూర్వకంగా స్వాగతించి, వారి సమస్యలను ఓర్పుతో విని చట్టబద్ధమైన పరిష్కారం చూపాలని తెలిపారు. నేరం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా, ముందస్తు నేర నివారణకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ స్పష్టం చేశారు. గ్రామాలు, తండాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర నిఘా కొనసాగిస్తూ శాంతిభద్రతలను కాపాడాలని ఆదేశించారు. సీసీటీఎన్ఎస్లో ప్రతి కేసు, ఎఫ్ఐఆర్, దర్యాప్తు పురోగతి, స్టేషన్ దినచర్యల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, ఎలాంటి పెండింగ్ ఉండరాదని సూచించారు. ప్రస్తుతం పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. డిజిటల్ అరెస్టు, లోన్ యాప్లు, ఓటీపీ, పెట్టుబడి, సోషల్ మీడియా మోసాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, బ్లూ కోల్ట్స్, మొబైల్ పెట్రోలింగ్, బీట్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం, చోరీలు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని పేర్కొన్నారు. విలేజ్ పోలీస్ అధికారులు గ్రామస్థాయిలో ప్రజలతో సమన్వయం పెంచుకొని స్థానిక సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం, దర్యాప్తులో జాప్యం, ఆన్లైన్ అప్డేట్లలో ఆలస్యం, ప్రజలతో అమర్యాదకరంగా వ్యవహరించడం ఏమాత్రం సహించబోమని ఎస్పీ డాక్టర్ శబరీష్ హెచ్చరించారు. ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా, పారదర్శకంగా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.




