
రైతు ఆశీర్వాద సభ విజయవంతానికి కాంగ్రెస్ శ్రేణుల కృషి అవసరం
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 09 2026: రేపు జరిగే మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాధపురంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్న రైతు ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పిలుపునిచ్చారు.
రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లకు సంబంధించి గురువారం సాయంత్రం 5 గంటలకు ఏన్కూరులోని కమ్మవారి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం, అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీ నుంచి కనీసం 100 నుంచి 150 మంది రైతులు, పార్టీ శ్రేణులు సభకు హాజరయ్యేలా సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు.
గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను చురుకుగా నిర్వహిస్తూ, ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా వివరించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. రైతులు, మహిళలు, యువత, పేద కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలని కోరారు
అదేవిధంగా ఏన్కూరు మండలానికి చెందిన సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రతినిధులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాల అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, బూత్ స్థాయి ప్రతినిధులు, గ్రామ శాఖా అధ్యక్షులు మరియు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి హాజరై సభ విజయానికి సహకరించాలని కోరారు.ఈ సమావేశంలో మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, వివిధ గ్రామాల పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.




