
చేతులు, కాళ్లు కట్టి వేడి గరిటెతో చిత్రహింసలు! పసిపిల్లలపై పాశవికం..
Web desc: పసి పిల్లల కాళ్లు, చేతులు కట్టేసి, వేడి గరిటెతో శరీరాన్ని కాల్చడంతో ఆ చిన్నారులు నరక యాతన భరించలేక చేసిన అరుపులు, గుండెలను పిండేశాయి. మానవత్వానికే మచ్చ తెచ్చేలా దాష్టీకానికి పాల్పడింది ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..! ఖమ్మం జిల్లాకు చెందిన ఇందూ అనే యువతికి వెంకటేష్ అనే వ్యక్తితో వివాహమైంది.
వీరికి ఇద్దరు బాలురు ఉన్నారు. ఇంతలోనే అనారోగ్యంతో వెంకటేష్ మృతి చెందాడు. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన నకరికంటి రవికి.. ఇందూతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇందూ.. రవిని రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తకు చెందిన ఇద్దరు చిన్నారులు, రెండో భర్త రవితో కలిసి హుజూర్ నగర్ లో నివాసం ఉంటున్నారు.
అల్లారు ముద్దుగా ఇంటిలో తిరుగుతున్న ఆ చిన్నారులు అంటే సవతి తండ్రి రవికి నచ్చలేదు. వారిని చూడగానే కోపం తెచ్చుకునేవాడు. రెండో భర్త రవి మాటలకు ప్రభావితమై సొంత బిడ్డలనే రోజూ నరకం చూపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అకారణంగా ఆ ఇద్దరు చిన్నారులను భార్యాభర్తలు చిత్రహింసలకు గురి చేసేవారు.
ఈ సవతి తండ్రి ఆధిపత్యానికి, తల్లి కఠినత్వానికి ఇద్దరు పసిపిల్లలు నరకం అనుభవించారు. చిన్నారుల చేతులు, కాళ్లు కట్టేసి, ఇనుప గరిటెతో వారి శరీరాన్ని కాలుస్తుంటే ఆ అభం శుభం తెలియని పిల్లలు తట్టుకోలేకపోయారు. ఆ చిన్నారుల ఆక్రందనాలు మాత్రం ఆ ఇంట్లో నిత్యకృత్యమయ్యాయి.
ఈ క్రమంలోనే మరోసారి వారి ఆర్తనాదాలు విన్న స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంట్లోకి వెళ్లి చూసిన వారికి కనిపించిన దృశ్యం చూసి కంటతడి పెట్టారు. వెంటనే ఆ పిల్లలను రక్షించి, హుజూర్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు.. పిల్లలపై దాష్టీకానికి కారణాలను తెలుసుకున్నారు.
ప్రస్తుతానికి పిల్లలను స్థానికుల సమక్షంలో ఉంచిన పోలీసులు, తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే, పిల్లల భవిష్యత్తు దృష్ట్యా వారిని అనాథ ఆశ్రమంలో చేర్పిస్తామని పోలీసులు చెబుతున్నారు.




