
మైగ్రేన్ తలనొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్య
Web desc : తీవ్రమైన మైగ్రేన్ సమస్య, మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఓ వివాహిత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మంగళవారంభీమిలి బీచ్ రోడ్డులోని తిమ్మాపురం వద్ద గల రామానాయుడు స్టూడియో ఎదరుగా చోటుచేసుకుంది.
పీఎంపాలెం సీఐ జి. బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ రామాంతపూర్కు చెందిన జెక్కా వెంకట లావణ్య ప్రియ (36) ఇంటి వద్ద నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగం చేస్తోంది. ఆమె భర్త అశ్విని కుమార్ పైడిభీమవరంలోని అరబిందో సంస్థలో ఉద్యోగం చేస్తుండటంతో, వీరు 2023 నుంచి మధురవాడలో నివాసం ఉంటున్నారు.
వీరికి ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఎంతో అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు తెలిపారు. అయితే లావణ్య ప్రియ కొంతకాలంగా తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం స్కూటీపై తిమ్మాపురం రామానాయుడు స్టూడియో ఎదురుగా ఉన్న బీచ్ రోడ్డుకు చేరుకుంది.
వాహనాన్ని పక్కన నిలిపి, బీచ్ సమీపంలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భరించలేక ఆమె రోడ్డుపైకి పరుగులు తీసింది. గమనించిన ప్రయాణికులు, బీచ్ పెట్రోలింగ్ కానిస్టేబుళ్లు రమేష్, శ్రీను వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు.
అప్పటికే 75 శాతానికి పైగా శరీరం కాలిపోయిన లావణ్య ప్రియను 108 అంబులెన్స్లో కేజీహెచ్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కుమార్తె మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, అల్లుడిపై ఎటువంటి ఆరోపణలు లేవని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




