
ఆపరేషన్ వికటించి మహిళ మృ*తి..
సోషల్ మీడియా వైరల్ : చైతన్యపురి: కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుందామని హాస్పిటల్కు వచ్చిన మహిళ మృతిచెందిన ఘటన హయత్ నగర్ నీలాద్రి హాస్పిటల్లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది.కుటుంబసభ్యులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం గోనెతండాకు చెందిన మంజుల(23) కు ఇద్దరు కుమారులు.
పెద్ద కుమారుడు 2 ఏండ్లు, చిన్న కుమారుడుకి 6 నెలలు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసమని శుక్రవారం హయత్ నగర్లోని నీలాద్రి ఆసుపత్రిలో చేరింది. శనివారం వైద్యులు ఆపరేషన్ చేశారు. అనంతరం నొప్పిగా ఉందని చెప్పడంతో యాంటిబయాటిక్స్ మందులు ఇచ్చారు.
యాంటిబయోటిక్స్ మందులు పడవని వైద్యులకు చెప్పినా వినలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. అనంతరం మంజుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నీలాద్రి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మంజుల మృతి చెందిందని బంధువులు ఆందోళన చేపట్టారు. ఘటనపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి వుంది .




