
డిప్యూటీ సీఎం ఇలాకాలో కనీస వసతులకు నోచుకోని సంక్షేమ హాస్టళ్లు
నాగులవంచ ఎస్సీ హాస్టల్ లో సమస్యలపై కెవిపిఎస్ సర్వే
సర్వేలో పాల్గొన్న కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క యొక్క ఎస్సీ నియోజకవర్గంలోనీ సంక్షేమ వసతి గృహాలలో కనీస వసతులకు కూడా నోచుకోకుండా విద్యార్థుల తీవ్ర అవస్థలు పడుతున్నారని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక నాగులవంచ ఎస్సి హాస్టల్ ని సందర్శించి సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వే అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్టల్లో కనీస వసతులైన కిటికీలు, బాత్రూములు, కరెంటు, తాగునీరు తదితర మౌళిక వసతులకు నోచుకోకుండా విద్యార్థులు అవస్థలు గురవుతున్నారని, సరిపడా మెస్ చార్జీలు లేక నాణ్యమైన భోజనం అందడం లేదని విద్యార్థులు వాపోయారు. బాత్ రూమ్ లకు తలుపులు, కిటికీలకు అద్దాలు, దోమ జాలీలు కూడా పెట్టలేని దుస్థితి నెలకొన్నదని, హాస్టల్లో కనీస మరమ్మతులకు ఎన్నో ఏళ్లుగా నిధులు ఇవ్వకపోవడంతో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, వర్షం వస్తే మురికి కుంటలుగా తయారై దోమలకు నిలయాలుగా మారి డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని తక్షణమే మరమ్మతుల కొరకు నిధులను విడుదల చేసి కనీస సౌకర్యాలు మెరుగుపరచాలని ఆయన డిమాండ్ చేశారు. పాఠశాలలు తెరిచి నెలలు కావస్తున్న నోట్ బుక్స్ అందజేయడంలో నిర్లక్ష్యం, యూనిఫారం ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థుల గోడును ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదని ఆయన అన్నారు. విద్యార్థుల నాణ్యమైన విద్య కొరకు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హాస్టల్లోనీ సమస్యలపై జిల్లా వ్యాప్తంగా సర్వేలు, ఆందోళనలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. హాస్టల్ సమస్యలను పరిష్కరించకపోతే రానున్న కాలంలో దశల వారీగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.




