
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ.
43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం.. 9.32 లక్షల క్యూసెక్కుల ప్రవాహం..
సి కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
జూలై 31,
భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం శుక్రవారం ఉదయం 10.14 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక (ఫస్ట్ వార్నింగ్) జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రస్తుతం 9,32,288 క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోందన్నారు.
గోదావరి పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజలను ముందస్తుగా సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
జిల్లా యంత్రాంగం వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని, పుకార్లను నమ్మవద్దని, గోదావరి నది వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో జిల్లా ఫ్లడ్ కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని కలెక్టర్ కోరారు.
ఫ్లడ్ కంట్రోల్ రూమ్ (24×7): 08744-241950
వాట్సాప్: 9392919743




