
ఒకే మహిళతో ఇద్దరి వివాహేతర బంధం.. నిందితుడి ఇంటికి నిప్పు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : ఒకే మహిళతో నడుపుతున్న వివాహేతర సంబంధం ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసి, చివరకు ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. కోపంలో కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో జరిగింది.
జింకలగూడెం గ్రామానికి చెందిన మౌలానా (42), ఇస్మాయిల్ ఒకే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఈ విషయమై ఈనెల 23న వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన ఇస్మాయిల్ తన కారుతో మౌలానాను బలంగా ఢీకొట్టి హత్యాయత్నానికి ఒడిగట్టాడు. తీవ్ర గాయాలపాలైన మౌలానాను మొదట భద్రాచలం, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశాడు. మౌలానాకు భార్య సాబీరా, కుమారుడు షారూఖ్ పాషా, కుమార్తె జాస్మీన్ ఉన్నారు. కాగా, ఘర్షణ జరిగిన రోజే బాధితుడి సోదరుడు నాగుల్మీరా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఇస్మాయిల్పై గతంలో పశువుల అక్రమ రవాణా కేసులతో పాటు రౌడీషీట్ కూడా ఉన్నట్టు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. నిందితుడి ఇంటికి నిప్పు..
మౌలానా మరణవార్త తెలియడంతో జింకలగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆక్రోశంతో ఉన్న మృతుడి కుటుంబసభ్యులు నిందితుడు ఇస్మాయిల్ ఇంటితో పాటు అతడి సమీప బంధువుల ఇంటి పై దాడిచేసి నిప్పుపెట్టారు. పోలీసులు స్థానికులతో కలిసి మంటలను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది.
కాగా, ఖమ్మం నుంచి మౌలానా మృతదేహన్ని తీసుకువచ్చిన బంధువులు, దానిని ఇస్మాయిల్ ఇంటి వద్ద ఉంచి ఆందోళనకు దిగారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడి కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. గ్రామంలో భారీపోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.




