
ఆరేళ్ల కూతురిని నడుముకు కట్టుకుని బావిలో దూకిన తల్లి
web desc : మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ తల్లి తన ఆరు సంవత్సరాల కుమార్తెను నడుముకు కట్టుకుని వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగింది.
స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన గొట్ల రజిత (26)కు, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేనుగుమట్లకు చెందిన మెరుగు అంజయ్యతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె అక్షిత (6), కుమారుడు మహేందర్ (18 నెలలు) సంతానం ఉన్నారు.
కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో రజిత తన పుట్టింటిలోనే ఉంటోంది. అప్పుడప్పుడు అక్కడికి వచ్చే అంజయ్య పిల్లలను చూసి వెళ్తుండేవాడు. ఆదివారం ఉదయం రజిత తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా, భర్త అంజయ్య వచ్చి పిల్లలను చూసి వెళ్లాడు.
అతను వెళ్లిన కొద్దిసేపటికే రజిత తన కుమారుడిని ఇంట్లోనే పడుకోబెట్టి, కుమార్తె అక్షితను వెంటబెట్టుకుని గ్రామ సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్ళింది. అనంతరం కుమార్తెను తన నడుముకు గట్టిగా కట్టుకుని ఒక్కసారిగా బావిలోకి దూకింది.
అటుగా వెళ్తున్న కొందరు స్థానికులు బావిలో మృతదేహాలు తేలియాడుతుండటాన్ని గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఎస్ఐ రాజ్వర్ధన్ స్పందిస్తూ.. తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. తల్లితో పాటు చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.




