
యాంకర్ స్వేచ్ఛ కేసులో కీలక మలుపు.. చిక్కడపల్లి పీఎస్కు పూర్ణ చందర్.. మీడియాకు సంచలన లేఖ
ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తమ కూతురు స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్ అనే వ్యక్తే కారణమని స్వేచ్ఛ తండ్రి శంకర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పూర్ణ చందర్ నాయక్ రాత్రి 11 గంటలకు అడ్వకేట్ సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లడం గమనార్హం.
అంతేకాదు.. తాను నిర్దోషిని అని, కోర్టులలో చెప్పే నిజాలు ప్రజలకు తెలియవని.. అందుకే మీడియాను ఆశ్రయించానని పూర్ణ చందర్ నాయక్ ఒక సంచలన లేఖ రాశాడు.
ఈ లేఖలో తనకు, స్వేచ్ఛకు మధ్య సన్నిహిత సంబంధం ఉందని పూర్ణచందర్ అంగీకరించాడు. అయితే.. ఆమెను ఆవహించిన ఒంటరితనానికి, ఆమె మానసిక స్థితికి తాను కారణం కాదని చెప్పాడు.
తన కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు పిలిపించి.. బెదిరించి.. పూర్ణచందర్ వచ్చే వరకూ మీరు పోలీస్ స్టేషన్లోనే ఉండాలని చెప్పిన విధానం తనను బాధించిందని పూర్ణ చందర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
స్వేచ్ఛ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య జరిగాయి. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమెకు తుది వీడ్కోలు పలికారు. హైదరాబాద్ చిక్కడపల్లి జవహర్నగర్లోని శీలమ్స్ రెసిడెన్సిలోని నివాసంలో శుక్రవారం స్వేచ్ఛ బలన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి సుమారు 11.30 గంటలకు ఆమె మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.
చిక్కడపల్లి పోలీసుల నుంచి పంచనామా పత్రాలు అందిన తర్వాత శనివారం మధ్యాహ్నం పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి, డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అందజేశారు. ముషీరాబాద్లోని వైఎస్సార్పార్క్ సమీపంలో తల్లిదండ్రుల ఇంటి వద్దకు భౌతిక కాయాన్ని తీసుకెళ్లారు.
అక్కడ పలువురు నివాళులర్పించిన తర్వాత అంతిమయాత్ర చేపట్టారు. దారిపొడవునా ప్రజాసంఘాల నేతలు స్వేచ్ఛను తలుచుకుంటూ విప్లవ గేయాలు పాడారు. అంబర్ నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ ఆరోపణలకు స్పందనగా, పూర్ణచందర్ ఒక ఐదు పేజీల లేఖను విడుదల చేయడం ఈ ఘటనను మరింత వివాదాస్పదంగా మార్చింది.పూర్ణచందర్ తన లేఖలో ఈ విదంగా పేర్కొన్నారు, 2009 నుండి స్వేచ్ఛతో తనకు స్నేహం ఉందని తెలిపారు. ఇద్దరూ అనేక వ్యక్తిగత విషయాలను పంచుకునేవారన్నారు.

స్వేచ్ఛ తల్లిదండ్రులు జనశక్తి కార్యకర్తలుగా పనిచేస్తూ, ఆరు నెలల వయసులో ఉన్న స్వేచ్ఛను ఆమె అన్న, వదినల సంరక్షణలో వదిలేసి, సంవత్సరానికి ఒకసారి మాత్రమే చూసి వెళ్లేవారని స్వేచ్ఛ తరచుగా తనతో ప్రస్తావించేదని పూర్ణచందర్ పేర్కొన్నారు.
ఆమె ఎప్పుడూ సంతోషంగా లేదని
స్వేచ్ఛ 2008-2009 మధ్య తన మొదటి వివాహం నుండి విడాకులు తీసుకున్నారని, దురదృష్టవశాత్తు 2016-2017 మధ్యకాలంలో రెండో వివాహానికి కూడా విడాకులు పొందారని, తన జీవితంలో ఆమె ఎప్పుడూ సంతోషంగా లేదని, ఆ ఆనందాన్ని కేవలం తన వృత్తిలోనే వెతుక్కునేదని పూర్ణచందర్ వివరించారు.
2020 అనంతరం స్వేచ్ఛ తనకు మరింత చేరువైనట్లు పూర్ణచందర్ అంగీకరించారు. తల్లిదండ్రుల మధ్య తరచుగా జరిగే గొడవలు తట్టుకోలేక, రామసాగర్ నుంచి కవాడిగూడ (Kavadiguda) కు సొంతంగా ఇల్లు అద్దెకు తీసుకుందని ఆయన పేర్కొన్నారు.
2022లో తన కుమార్తెను కూడా తన వద్దకు తీసుకొచ్చి, ఆమె బాధ్యతలన్నీ తానే చూసుకుంటానని చెప్పినప్పటికీ, తండ్రి స్థానంలో తాను ఆ పాప సంరక్షణ బాధ్యతలు చూసుకున్నానని పూర్ణచందర్ వెల్లడించారు. గత ఏడాది, పాప, స్వేచ్ఛ ఇద్దరూ బాధపడకూడదని రూ. 5 లక్షలు ఖర్చు చేసి పాప మెచ్యూరిటీ ఫంక్షన్ కూడా నిర్వహించామని ఆయన తెలిపారు.
తనను ఎంతగానో బాధించాయని ఆయన పేర్కొన్నారు
అంతేకాకుండా, స్వేచ్ఛ డిప్రెషన్, ఆందోళన, మానసిక ఆవేదనల నుండి బయటపడటానికి అనేకసార్లు ఆసుపత్రికి తీసుకువెళ్ళానని, ఆ రిపోర్ట్స్ అన్నీ తన గదిలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.
స్వేచ్ఛతో గానీ, ఆమె బిడ్డతో గానీ తనకు ఎలాంటి విభేదాలు లేవని పూర్ణచందర్ స్పష్టం చేశారు. ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి స్వేచ్ఛ తండ్రి ఆమె ఇంటికి వచ్చి మాట్లాడిన మాటలు తనను ఎంతగానో బాధించాయని ఆయన పేర్కొన్నారు.
తన గురించి చెప్పగానే స్వేచ్ఛ తండ్రి చాలా అవమానకరంగా మాట్లాడారని రాసుకొచ్చారు. ‘రెండేళ్లకొకసారి ఇతను మీ అల్లుడు అని చెబితే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని, డబ్బు లేకపోయినా గౌరవాన్ని కోల్పోలేనని’ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి స్వేచ్ఛ (Swetcha) తనకు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుందని పూర్ణచందర్ వివరించారు.
తాను వారిని ఎలా చూసుకున్నానో స్వేచ్ఛ బంధువులందరికీ తెలుసని, తనను స్వేచ్ఛ భర్తగా భావించి అన్ని సామాజిక మాధ్యమాల్లో స్వేచ్ఛ పూర్ణచందర్ అని రాసుకుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
స్వేచ్ఛ ఆత్మహత్యపై ఆమె తండ్రి శంకర్ ఏం చెప్పారంటే..
తమ కూతురు స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్ అనే వ్యక్తే కారణమని మృతురాలి తండ్రి శంకర్ ఆరోపించారు. గాంధీ మార్చురీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
పూర్ణచందర్ మూడేండ్ల నుంచి తన కూతురు వెంట పడ్డాడని, అతడి వేధింపుల వల్లే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ”నా కూతురు పెండ్లికి అంగీకరించినా కూడా ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవ జరిగింది.
ఇటీవల గొడవలు తీవ్రంకాగా పూర్ణచందర్తో కలిసి ఉండను అని స్వేచ్ఛ తేల్చి చెప్పింది. ఈ నెల 26న ఇద్దరికీ గొడవ జరిగితే నన్ను ఇంటికి రమ్మని పిలిచింది. అప్పుడు నేను వెళ్లి మాట్లాడిన. పూర్ణచందర్తో నేను రిలేషన్ లో ఉండలేను అని చెప్పింది.
పూర్ణచందర్ వేధింపుల వల్ల నా కూతురు తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నది’ అని తండ్రి శంకర్ తీవ్ర ఆవేదన చెందారు.