
వేదికపై మంత్రి V/S ఐపీఎస్… ‘దెన్ గెట్ అవుట్ ఆఫ్ హియర్’
Web desc : గ్రీవెన్స్ సెల్లో వేదికపై ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. తాను ఆదేశిస్తున్న ఆదేశాల్ని ఓ ఐపీఎస్ అధికారిణి పట్టించుకోలేదని కోపంతో ఓ మంత్రి ఊగిపోయాడు.
హర్యానా మంత్రి అనిల్ విజ్, సీనియర్ పోలీసు అధికారిణి మధ్య శుక్రవారం కైతాల్ జిల్లాలో గ్రీవెన్స్ పరిష్కార కమిటీ సమావేశంలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆ జిల్లాలోని తిత్రం గ్రామానికి చెందిన సందీప్ మాలిక్ అనే వ్యక్తి.. భూమి కొనుగోలు కేసులో సందీప్ అనే ఎస్ఐ మోసం చేశాడని మంత్రికి ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందంచిన మంత్రి అనిల్ విజ్.. తక్షణమే అతడ్ని సస్పెండ్ చేయాలని కైతాల్ ఎస్పీ ఉపాసనను ఆదేశించారు.
అయితే, అది తన పరిధి కాదని, మరో జిల్లా పోలీస్ను సస్పెండ్ చేసే అధికారం తనకు లేదని ఆమె బదులిచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐ కురుక్షేత జిల్లా పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నాడని ఆమె చెప్పారు. ఇది మంత్రి, ఎస్పీ మధ్య వాగ్వాదానికి దారితీసింది.
‘అతన్ని సస్పెండ్ చేయండి’ అని ఎస్పీని మంత్రి ఆదేశించగా.. ‘అది నా పరిధి కాదు. కురుక్షేత్ర ఎస్పీ చేయాల్సి ఉంటుంది’ అని ఆమె చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ‘అతడ్ని సస్పెండ్ చేయమని నేను చెబుతున్నాను.. డీజీపీకి రాయండి..
నా ఆదేశాలను మీరు అమలు చేయాలి’ అని మంత్రి హుకుం జారీచేశారు. దీనికి ఎస్పీ ఉపాసన వివరణ ఇస్తూనే.. తనకు అలా చేసే అధికారం లేదని చెప్పారు. కురుక్షేత్ర ఎస్పీ లేదా డీజీపీకి మాత్రమే ఉందని ఆమె బదులిచ్చారు.
దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి ‘మీకు అధికారం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. అతడ్ని సస్పెండ్ చేయాలని మంత్రి అనిల్ విజ్ ఆదేశించారని డీజీపీకి రాయండి’ అని విజ్ అన్నారు.
కానీ, మహిళా ఐపీఎస్ స్పందిస్తూ.. తాను రాస్తాను కానీ ఆయనను సస్పెండ్ చేసే అధికారం నాకు లేదని స్పష్టంగా చెప్పారు. దీనికి మంత్రి ‘నేను చెప్పినట్టు మాత్రమే చేయండి, మీ సొంత అభిప్రాయం చెప్పకండి..
సస్పెండ్ చేయమని నేను చెప్పినట్టు డీజీపీకి రాయండి’ అని ఆమెపై అధికారం చెలాయించారు. దీనికి ఎస్పీ అలాగే చేస్తానంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.
ఈ అంశంపై మంత్రిని మీడియా స్పందించగా.. తాము ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నామని, అంతిమంగా వారిని న్యాయం జరగడమే ప్రధానమని అన్నారు.
అయితే, సబ్-ఇన్స్పెక్టర్ను ఎస్పీ ఎలా సస్పెండ్ చేయగలదని, ఆమె ఆ అధికారం లేదు కదా అని ప్రశ్నించగా.. తాను సస్పెండ్ చేయమని చెప్పలేదని, ఆ అధికారం ఉన్నవారికి లేఖ రాయమని సూచించానని అనడం గమనార్హం



