
ములుగు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..
ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయం స్టోర్ రూమ్లో ఇవాళ(ఆదివారం) అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో స్థానికులు అప్రమత్తమయ్యారు.
కార్యాలయంలో భద్రపరిచిన పలు ముఖ్య రికార్డులు మంటల్లో కాలిపోయినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్యాలయంలోని స్టోర్ రూమ్ నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటాన్ని గమనించి స్థానికులు అప్రమత్తమయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో కార్యాలయమంతా పొగలు కమ్ముకున్నాయి.
అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉన్న వనరులతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
కార్యాలయంలోని పాత వైరింగ్ లేదా విద్యుత్ లోపాల వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. కాలిపోయిన రికార్డుల వివరాలను సేకరిస్తున్నారు.




