
జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
తెలంగాణ కాంగ్రెస్ (టీపీసీసీ) కోఆర్డినేటర్ ధార భాస్కర్ బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
నవాబ్పేట మండలం పోమాలకు చెందిన భాస్కర్ ప్రెస్మీట్ పెట్టేందుకు క్యాంప్ కార్యాలయంలోకి వెళ్తుండగా.. పోలీసులు గేటు వద్దనే అడ్డుకున్నారు. ఈ క్రమంలో భాస్కర్కు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకోవడం తో ఉద్రిక్తత చోటుచేసుకున్నది.
ఎమ్మెల్యే, అతడి సోదరుడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార పార్టీ నేత, టీపీసీసీ కోఆర్డినేటర్గా ఉన్న తాను క్యాంప్ కార్యాలయంలో ప్రెస్మీట్ పెడుతానంటే భయమెందుకని ప్రశ్నించారు. కొన్ని రోజులుగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సోదరుడు దుశ్యంత్రెడ్డికి, టీపీసీసీ కోఆర్డినేటర్ భాస్కర్కు మధ్య వివాదం నడుస్తున్నది.
ఈ క్రమంలో తనపై తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నాడని, వివాదం గురించి జడ్చర్ల క్యాంప్ కార్యాలయంలోనే ప్రెస్మీట్ పెట్టి వెల్లడిస్తానని భాస్కర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అనుమతి లేకుండా ప్రెస్మీట్ పెట్టేందుకు వచ్చిన భాస్కర్ను అరెస్ట్ చేసి అడిషనల్ ఎస్పీ ఎదుట హాజరుపర్చినట్టు సీఐ కమలాకర్ తెలిపారు..
జడ్చర్లలో ఓ టీ షాపు వద్ద టీపీసీసీ కోఆర్డినేటర్ భాస్కర్ తనను కొట్టాడంటూ ఓ కాంగ్రెస్ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ రాజాపూర్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య.. కొద్ది రోజుల కిందట ఎమ్మెల్యే సోదరుడితో తనకు ప్రాణహాని ఉందని పీఎస్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే సోదరుడు తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నాడని మరో నేత ఆరోపిస్తూ ఏ కంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్మీట్ పెట్టేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.



