
నకిలీ మందులు అమ్మిన మెడికల్ షాపులపై కఠిన చర్యలు తప్పవు
నకిలీ మందులు అమ్మిన మెడికల్ షాపులపై కఠిన చర్యలు తప్పవని డ్రగ్ ఇన్ స్పెక్టర్ సురేందర్ హెచ్చరించారు.
మెడికల్ షాపులో నకిలీ మందులు, ప్రభుత్వం నిషేధించిన చిన్నపిల్లల దగ్గు టానిక్స్ విక్రయిస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు శుక్రవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని పొనుగోడు గ్రామంలోనీ శ్రీ రామ మెడికల్ షాప్ లో ఆకస్మిక తనిఖీ లు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతూ నకిలీ మందులు విక్రయించే మెడికల్ షాప్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, నకిలీ మెడిసిన్ అమ్మి ప్రజలను మోసం చేసే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా లాభాల కోసం ఇలాంటి ప్రమాదకర నకిలీ మందులు విక్రయించడం తీవ్రమైన నేరమని తెలిపారు. అసలు అనుమతి లేని మందులు, నిషేధిత టానిక్స్, కల్తీ రసాయనాలు విక్రయించే మెడికల్ షాపుల లైసెన్సులు రద్దు చేసి కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ప్రభుత్వం నిషేధించిన టానిక్ ల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా ఉన్న మెడికల్ షాపులపై వెంటనే డ్రగ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు.



