
‘కార్పొరేట్’ కేళిలో కునారిల్లుతున్న సామాన్యుడు: అభివృద్ధి అంకెల్లో.. ఆకలి క్షేత్రంలో!
భారతదేశం అగ్రరాజ్యాల సరసన నిలబడేందుకు సిద్ధమవుతోంది. జీడీపీ వృద్ధి రేటులో ప్రపంచ దేశాలను వెనక్కి నెడుతోంది. కానీ, మెరుస్తున్న నగరాల వెనుక, కార్పొరేట్ భవనాల నీడన ఒక భయంకరమైన అసమానత రాజ్యమేలుతోంది. దేశ పాలకుల చూపు కేవలం కార్పొరేట్ సంస్థల లాభాల పైనే ఉందా? అన్న అనుమానం కలిగేలా నేటి పరిస్థితులు ఉన్నాయి.
అక్షర సత్యాలు.. ఆందోళనకర గణాంకాలు
ప్రపంచ అసమానతల నివేదిక ప్రకారం, భారతదేశంలోని టాప్ 1% ధనవంతుల వద్ద దేశ మొత్తం సంపదలో 40% పైగా కేంద్రీకృతమై ఉంది. మరోవైపు, దేశ జనాభాలో సగం మంది అంటే దాదాపు 70 కోట్ల మంది ప్రజల వద్ద ఉన్న సంపద కేవలం 3% మాత్రమే. ఇది మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోతైన అగాధాన్ని సూచిస్తోంది.
అదనపు భారం.. తగ్గుతున్న ఆదాయం
ప్రభుత్వం కార్పొరేట్ పన్నులను భారీగా తగ్గించి వారికి రాయితీలు ఇస్తోంది. కానీ ఆ లోటును భర్తీ చేసేందుకు సామాన్యుడిపై జీఎస్టీ భారాన్ని మోపుతోంది. గణాంకాల ప్రకారం, దేశంలో వసూలవుతున్న మొత్తం జీఎస్టీలో 64% వాటా జనాభాలోని దిగువ 50% వర్గాల నుండే వస్తోంది. అంటే, కార్పొరేట్ల కంటే పేదవాడే ప్రభుత్వ ఖజానాను ఎక్కువగా నింపుతున్నాడు.
సంక్షేమమా? ప్రైవేటీకరణా?
విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలను పాలకుల నిర్లక్ష్యం వల్ల కార్పొరేట్ శక్తులు కైవసం చేసుకుంటున్నాయి. భారత్ విద్యపై తన జీడీపీలో కేవలం 2.9%, ఆరోగ్యంపై 2.1% మాత్రమే ఖర్చు చేస్తోంది. ఇది అంతర్జాతీయ ప్రమాణాల కంటే చాలా తక్కువ. ఫలితంగా, పేదవాడు నాణ్యమైన చదువుకు, వైద్యానికి దూరమై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. అదానీ, అంబానీలు ప్రపంచ కుబేరుల జాబితాలో చేరడం అంటే దేశం అభివృద్ధి చెందినట్లు కాదు. పల్లెటూరిలో రైతుకు గట్టుబాటు ధర దొరికినప్పుడు, నిరుద్యోగ యువతకు చేతినిండా పని దొరికినప్పుడు, పేదవాడికి ఉచితంగా వైద్యం అందినప్పుడే అది నిజమైన అభివృద్ధి. పాలకులు ఇప్పటికైనా కార్పొరేట్ వ్యామోహం వీడి, క్షేత్రస్థాయిలో ప్రజల కష్టాలను తీర్చే దిశగా అడుగులు వేయాలి. అప్పుడే మనం కలలు కంటున్న ‘విశ్వగురువు’ భారత్ సాధ్యమవుతుంది.
డి.వై. గిరి
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
సెల్ : 7013667743



