
భద్రాచలంలో విషాదం.. గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతు
Web desc : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తీవ్ర విషాదం నెలకొంది. భద్రాచలం సరిహద్దు కూనవరం వద్ద గోదావరిలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు.
ఇందుకు సంబంధించిన వివరాలు… ఏపీలోని ఓ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు భద్రాచలం పర్యటనకు వచ్చారు. భద్రాచలం – కూనవరం రహదారిలోని ఓ ఇసుక ర్యాంపు ప్రాంతంలో గోదావరి నది అందాలను చూసేందుకు వారు వెళ్లారు. అయితే అక్కడ గోదావరిలో స్నానం చేసేందుకు దిగారు.
నది లోతును అంచనా వేయకపోవడంతో, ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఐదుగురు యువకులు గోదావరిలో గల్లంతయ్యారు. అయితే మరో ఇద్దరు మాత్రం ఈ ఘటన నుంచి బయటపడ్డారు. అయితే వారు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
నదిలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గల్లంతైన వారిని సతీశ్, నవదీప్, తేజ, అభిరామ్, శ్రీకర్ గా గుర్తించారు.
ప్రస్తుతం ఘటన స్థలంలో సహాయక చర్యలు సాగుతున్నాయి. గజ ఈతగాళ్లు నదిలో యువకుల కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతానికి గల్లంతైన వారి ఆచూకీ లభించకపోవడంతో యువకుల కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



