
రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొని యువకుడు మృతి…
ఖమ్మం రూరల్ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్దులపల్లి గ్రామానికి చెందిన గొడ్డు గొర్ల ప్రసాద్ (పెయింటర్) మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ప్రసాద్ మద్దులపల్లి స్టేజ్ వద్ద ఉన్న కిరాణా షాపుకు వెళ్లి తిరిగి రోడ్డు దాటుతుండగా, గుర్తుతెలియని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఘటన సమాచారం అందుకున్న సీఐ ముష్కరాజు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 2వ తేదీన ప్రసాద్కు నిశ్చితార్థం జరగాల్సి ఉండగా, అంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. దీంతో ఇంట్లో జరగాల్సిన శుభకార్యం కన్నీటి వాతావరణంగా మారింది.



