
చేవెళ్లలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ
చేవెళ్లలో ఆరు హత్యల ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఘటనాస్థలికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన ఎదురైంది.బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను పలువురు స్థానికులు అడ్డుకుని తమ ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనకారుల ఆగ్రహంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు ధర్నా ప్రాంతానికి వచ్చిన జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి కూడా నిరసన సెగ తగిలింది.
బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పరామర్శకు వస్తే రాజకీయాలు చేస్తున్నారా..? బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన సమయంలో కొందరు రాజకీయ విమర్శలు చేయడం సరికాదని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు.
ఈ ఘటనపై రాజకీయాలు చేయకుండా బాధితులకు న్యాయం జరిగేలా సహకరించాలని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి కూడా స్పందిస్తూ.. పరామర్శ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడటం సరికాదని పేర్కొన్నారు. ప్రస్తుతం బాధిత కుటుంబాల ధర్నా కొనసాగుతోంది.




