
బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం!
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సివిల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న బూరుగు మైనా(22) అనే విద్యార్థిని శుక్రవారం సాయంత్రం కళాశాల భవనం పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఈ ఘటనలో ఆమె తలకు, కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో సహచర విద్యార్థులు, కళాశాల సిబ్బంది వెంటనే స్పందించి సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
విద్యార్థిని ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. వ్యక్తిగత సమస్యలా? చదువులో ఒత్తిడా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామానికి చెందిన మైనా ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థులు తీవ్ర షాక్కు గురయ్యారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విద్యాసంస్థలు, తల్లిదండ్రులు విద్యార్థుల మానసిక స్థితిపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.ఈ చర్య వెనుక గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.




