
పోలీస్ స్టేషన్ లో వ్యక్తి ఆత్మ*హత్యాయత్నం
చైతన్యపురి : మాట్రిమోని యాప్ లో పరిచయమై పెళ్ళి చేసుకుని చివరకు తన భార్య ఇబ్బంది పెడుతుందని పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ఉదంతం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెలుగులోకి వచ్చింది.
ఇన్స్పెక్టర్ కె. సైదులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామానికి చెందిన ఇటుకల మహేష్(29) ప్రైవేట్ జాబ్ చేస్తుంటాడు. ప్రస్తుతం దిల్ సుఖ్ నగర్ లోని వికాస్ నగర్ లో రమాదేవి బాయ్స్ హాస్టల్ లో ఉంటున్నాడు.
ఇతను విలాసాగరం సమతను భారత్ మాట్రిమోని యాప్ లో చూసి 14 ఆగష్టు 2025 న వివాహం చేసుకున్నాడు. పెళ్ళయిన తరువాత జూబ్లీహిల్స్ వెంకటగిరి కాలనీలో కాపురం పెట్టారు. కొన్ని రోజుల తరువాత మహేష్ కు తన భార్యపైన అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలు జరగుతూ ఉండేవి.
అప్పటి నుంచి గొడవల కారణంగా ఇద్దరు విడివిడిగా హాస్టల్ లో ఉండేవారు. ఈ క్రమంలో 10 ఫిబ్రవరి 2026 న మహేష్ అతని భార్య సమత ఇరువురు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టగా మహేష్ తన భార్యకు వేరే వారితో అక్రమ సంబంధం ఉన్నదని చెప్పాడు.
అప్పుడు పంచాయతీ పెద్దలు సాక్ష్యాధారాలు అడుగగా అతను రెండు నెలల సమయం కావాలని అడిగాడు. ఇందులో భాగంగా 8 ఏప్రిల్ 2026 న మహేష్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ కు వచ్చి తన భార్య సీడీఆర్, వాట్సాప్స్ చాట్ కావాలని అడుగగా అది ఇవ్వడానికి కుదరదని పోలీసులు తెలిపారు.
అతను బుధవారం ఉదయం 11 గంటలకు డెటాల్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి తన భార్య సమత సీడీఆర్, వాట్సాప్స్ చాట్ ఇప్పించాలని తమను బెదిరించి తన వెంట తెచ్చుకున్న డెటాల్ ను త్రాగుతుండగా అది గమనించిన తాము హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయించడం జరిగిందని తెలిపారు. భార్యభర్తలకు సంబందించిన గొడవ అయినందున కోర్టు ద్వారా గాని ఫ్యామిలీ కౌన్సెలింగ్ ల ద్వారా గాని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించినట్లు తెలిపామని సీఐ తెలిపారు.
వైరల్ అవుతున్న మహేష్ వీడియో
పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తాను ఆత్మహత్యకు పూనుకున్నానని బాధితుడు వాట్సప్ లో వీడియో విడుదల చేయగా వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. తన భార్య ప్రియుడుతో కలిసి తనని చంపాలని చూశారని పోలీసులను ఆశ్రయిస్తే పట్టించుకోలేదని వీడియో విడుదల చేశాడు.




