
కేటీపీఎస్ సమ్మె నేపధ్యంలో ఏన్కూరులో భద్రత కఠినం
సమ్మెకు వెళ్లే కార్మికుల అడ్డుకట్ట
ఏన్కూరులో వాహనాల తనిఖీలు ముమ్మరం
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఏప్రిల్ 11 2026: ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని, జీవో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని, అలాగే 2016లో అర్హత ఉండి మిగిలిపోయిన కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) కార్మికులు బుధవారం మెరుపు సమ్మెకు దిగారు.
ఈ నేపథ్యంలో బుధవారం భారీ సంఖ్యలో కార్మికులు వరంగల్ ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు వెళ్లారు. అయితే యాజమాన్యం చర్చలకు ముందుకు రాకపోవడంతో కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. సమ్మె ప్రభావంతో కేటీపీఎస్లో సుమారు 1800 మంది కార్మికులలో కేవలం 531 మంది మాత్రమే విధులకు హాజరుకావడం గమనార్హం.
ఇక కేటీపీఎస్ కేంద్రంలో ఆందోళనలు జరగకుండా యాజమాన్యం నిషేధాజ్ఞలు విధించడంతో, కార్మికులు కేటీపీఎస్ ఆసుపత్రి ఎదుట ఉన్న హెచ్-84 కార్యాలయ ప్రాంగణంలో తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
మరోవైపు ఈ సమ్మెకు ఇతర ప్రాంతాల నుంచి కూడా కార్మికులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో, సమ్మెను నియంత్రించేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏన్కూరు మండలంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ప్రత్యేకంగా ఏన్కూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా వాహనాలను ఆపి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సమ్మెకు వెళ్లే కార్మికులను గుర్తించి వారిని అడ్డుకుని తిరిగి పంపిస్తున్నారు. దీంతో ఏన్కూరు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కార్మికుల డిమాండ్లపై యాజమాన్యం స్పందించి చర్చలు జరిపే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.



