
వరంగల్ హైవేపై ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు…
నర్సంపేట నుంచి వరంగల్కు వెళ్లే ప్రధాన రహదారి పై మంగళవారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మక్కల లోడుతో వెళ్తున్న లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
నర్సంపేట నుంచి మక్కజొన్న లోడ్తో వరంగల్ వైపుగా లారీ వెళ్తుండగా, కాశీబుగ్గకు చెందిన వెల్దండి వరుణ్ (34) నర్సంపేట వైపుగా కారులో వెళ్తున్నాడు. సరిగ్గా దుగ్గొండి మండలం గిర్నిబావి సెంటర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో వరుణ్కు తీవ్ర గాయాలు కాగా, కారు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.




