
ఖమ్మంలో CRPF కానిస్టేబుల్ అరెస్ట్… ఖమ్మం నగరంలో ఓ CRPF కానిస్టేబుల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన సోదరి, మేనకోడలిపై దాడి చేయడమేగాక, పురుగుల మందు తాగించి సోదరిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడనే అభియోగాలపై అతన్ని అరెస్ట్ చేసినట్లు ఖమ్మం నగరంలోని ఖానాపురం హవేలీ సీఐ భానుప్రకాష్ తెలిపారు.
ఘటనకు పూర్వాపరాలు సీఐ భానుప్రకాష్ కథనం ప్రకారం.. CRPF కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కేలోత్ రమేష్ అతని సోదరి బాణోత్ పద్మ, ఆమె కుమార్తె గుగులోత్ వాణి వద్ద దాదాపు రూ. 35.00 లక్షల నగదు, ఆభరణాలు అప్పుగా తీసుకున్నాడు. వాటి ద్వారా గొల్లగూడెం రోడ్డులోని పీఎన్ఆర్ డూప్లెక్స్ ప్రాంతంలో ఇంటి నిర్మాణం చేసుకున్నాడు.
అయితే తమ వద్ద తీసుకున్న నగదు, ఆభరణాలను తిరిగి ఇవ్వాలని బాణాత్ పద్మ, గుగులోత్ వాణిలు పలుసార్లు కోరారు. ఈ నేపథ్యంలోనే కొంత నగదును, బంగారం తిరిగి ఇస్తానని నమ్మబలికిన CRPF కానిస్టేబుల్ రమేష్ గతనెల 28వ తేదీన వారిద్దరినీ తన ఇంటికి పిలిపించి, వారిని అటకాయించి వారివద్ద గల నాలుగు చొప్పున ప్రాంసరీ నోట్లు, చెక్కులను బలవంతంగా లాక్కుని వారిని తీవ్రంగా గాయపర్చాడు.
ఘటనానంతరం తన ఇంటికి వెడుతున్న బాణోత్ పద్మను మార్గమధ్యంలో కానిస్టేబుల్ రమేష్ అడ్డగించి, బలవంతంగా పురుగుల మందు తాగించి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈమేరకు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై గత 28వ తేదీన క్రైం నెం.365/2026 ద్వారా బీఎన్ఎస్ చట్టంలోని 308(2), 118(2), 115(2) r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ భానుప్రకాష్ వివరించారు.
కేసులో ప్రధాన నిందితుడైన CRPF కానిస్టేబుల్ కేలోత్ రమేష్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితున్ని కోర్టులో హాజరుపరిచామని, కేసులో విచారణ కొనసాగుతోందని ఖానాపురం హవేలీ సీఐ భానుప్రకాష్ పేర్కొన్నారు.




