
తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..
ఏన్కూరు వద్ద సాంకేతిక లోపంతో ఆగిపోయిన ఆర్టీసీ బస్సు
మృత్యువు అంచుల దాకా వెళ్లి తిరిగొచ్చిన ప్రయాణికులు..
50 మంది ప్రాణాలను కాపాడిన డ్రైవర్ సమయస్ఫూర్తి
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జులై 07 2026: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల పరిధిలో మంగళవారం తృటిలో పెను ప్రమాదం తప్పింది. భద్రాచలం నుండి ఖమ్మం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఏన్కూరు సమీపంలోని ఎన్ఎస్పీ కాలువ వద్ద, జన్నారం క్రాస్ రోడ్డు దాటిన కొద్దిసేపటికే సాంకేతిక లోపానికి గురైంది. బస్సు స్టీరింగ్ ఒక్కసారిగా స్టక్ కావడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదం తప్పింది.
సమాచారం ప్రకారం, బస్సులో సుమారు 40 నుంచి 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. స్టీరింగ్ పనిచేయకపోవడంతో క్షణాల్లోనే ప్రమాదం సంభవించే పరిస్థితి ఏర్పడినా, డ్రైవర్ సమయస్ఫూర్తితో బస్సును అదుపులోకి తీసుకువచ్చి సురక్షితంగా నిలిపివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఘటనతో ఒక్కసారిగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సు ఆగిన వెంటనే కొందరు ప్రయాణికులు కిందకు దిగి పరిస్థితిని పరిశీలించగా, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదు. సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బస్సును పరిశీలించినట్లు తెలిసింది. అనంతరం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
ఈ ఘటన మరోసారి ఆర్టీసీ బస్సుల సాంకేతిక నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రయాణికుల ప్రాణాలకు భద్రత కల్పించేలా బస్సులను తరచూ సాంకేతికంగా తనిఖీ చేసి రోడ్లపైకి పంపాలని ప్రయాణికులు కోరుతున్నారు. సమయానికి డ్రైవర్ చూపిన చాకచక్యంతోనే పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.




